దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ 25కు వాయిదా

ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసు లు జారీ చేసింది. శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, శాసన సభాపతి, శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్, ఎంఎల్‌ఎ దానం నాగేం దర్‌లకు నోటీసులు జారీ చేసింది. 

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన దానం, తర్వాత కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ శాసన సభాపతికి బిఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

దానంపై అనర్హత వేటు వేసేలా శాసన సభాపతిని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, ఆయన పార్టీ ఫిరాయించారడానికి ఇదే నిదర్శనమని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది సంతోశ్ కోర్టుకు వెల్లడించారు. 

దానం నాగేందర్ పార్టీ మారినా, ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా, శాసన సభాపతి మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఈ నెల 10న హైకోర్టును ఆశ్రయించింది. బిఆర్‌ఎస్ తరఫున గెలు పొంది, కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్న బిఆర్‌ఎస్, సభాపతి ఇంకా స్పందించడం లేదని ఫిర్యాదులో వెల్లడించింది. దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని సభాపతిని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.