రష్యా సైనిక స్థావరంపై ఉక్రెయిన్ భీకర దాడులు

రష్యాలోని మోరోజోవిస్క్ సైనిక స్థావరంపై ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది. శుక్రవారం ఉక్రెయిన్ సేనలు, ఎస్‌బియు సెక్యూరిటీ సర్వీసెస్ బలగాలు లిసి సంయుక్తంగా రోస్టోవ్ ప్రాంతంలోని ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడ్డాయని కీవ్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ర‌ష్యాతో యుద్ధం మొద‌లైన త‌ర్వాత‌.. తొలిసారి ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడికి దిగిన‌ట్లు భావిస్తున్నారు. ర‌ష్య‌న్ నేల‌పై కీవ్ ద‌ళాలు త‌మ ఉదృతిని పెంచాయి.ఈ అనూహ్య అసాధారణ దాడిలో రష్యాకు చెందిన ఆరు యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఇతరత్రా కూడా నష్టం వాటిల్లింది. దాడులు ఎప్పుడు, ఏ రీతిన జరిగాయనేది వెంటనే వెల్లడికాలేదు. 

అయితే ఉక్రెయిన్ అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించిన ఈ దాడిలో మరో ఎనిమిది యుద్ధ విమానాలుకూడా ధ్వంసం అయినట్లు వెల్లడైంది. కాగా రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పందిస్తూ దాడి జరిగిన విషయాన్ని ధృవీకరించారు. అయితే మొత్తం 44 డ్రోన్లను వెంబడించి ధ్వంసం చేశారని, సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని వివరించారు.

 ఈ ఘటనలో ఓ విద్యుత్ కేంద్రం కూడా దెబ్బతిందని రోస్టోవ్ గవర్నర్ వాసిలీ గోలుబెవ్ తెలిపారు.  డ్రోన్ల దాడి వ‌ల్ల‌ మోరోజోవెస్కీ వ‌ద్ద ఉన్న వైమానిక క్షేత్రానికి ఎటువంటి న‌ష్టం జ‌రిగింద‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు. కుర్స్క్, బెల్గొరోడ్‌, క్రాస్న‌డోర్ ప్రాంతాల వ‌ద్ద మ‌రో 9 డ్రోన్ల‌ను కూల్చిన‌ట్లు ర‌ష్యా తెలిపింది. మ‌రో వైపు రష్యా చేసిన డ్రోన్ దాడిని ఉక్రెయిన్ తిప్పికొట్టింది. 13 ర‌ష్యా డ్రోన్ల‌ను కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది.

రష్యా ఉక్రెయిన్ ప్రస్తుత యుద్ధంలో డ్రోన్లతో పరస్పరం తలపడుతున్న దశ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరుదేశాల నడుమ యుద్ధం ఇప్పుడు మూడో ఏడాదిలోకి చేరింది. ప్రధానంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడటం తగ్గించి ఇప్పుడు నిర్ణీత లక్షాలను ఎంచుకుని డ్రోన్లతో ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానంతో పరస్పర దాడులు జరుగుతున్నాయి.