హమాస్‌పై యుద్ధంలో ఏఐ టూల్‌ని వినియోగిస్తున్న ఇజ్రాయెల్‌

 
* ఆయుధ సరఫరా ఆపమన్న మానవ హక్కుల మండలి
 
హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా హమాస్‌ లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సహాయం తీసుకుంటుందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏఐ ఆధారిత టూల్‌ని ‘లావెండర్‌’ పేరుతో పిలుస్తారు. ఏఐ టూల్‌తో పదిశాతం తప్పు జరిగిందని నివేదిక పేర్కొంది. 
 
దీనిపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్)ని సంప్రదించగా ఏఐ టూల్‌ ఉనికి ఖండించలేదు. అయితే, అనుమానిత ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. టూల్‌ రబ్బర్‌ స్టాంప్‌లా పని చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. టూల్‌ ఎవరైనా వ్యక్తిని గుర్తిస్తే 20 సెకన్లలో దాడి చేస్తుందని సమాచారం. 
 
ఈ టూల్‌ ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియలో సమాచార వ్యవస్థ మాత్రమేనని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధ సమయంలో పౌరులకు నష్టం జరిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. నిబంధనలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషకులు స్వతంత్ర దర్యాప్తు జరపాలని సైన్యం సూచిస్తున్నది. ఇజ్రాయెల్‌ సైనిక చర్యపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది.
ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన లక్షిత వైమానిక దాడుల్లో పాలస్తీనియన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్న అనేక విదేశీ సహాయ కార్యకర్తలపై దాడి చేసిన చంపినట్లు ఆరోపణలున్నాయి.  గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 32,916 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం నేపథ్యంలో ఉత్తర గాజాలు నాలిగింట మూడొంతుల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. మరోవంక, గాజాలో నెలల తరబడి సాగుతున్న యుద్ధం, విధ్వంసం, ప్రాణనష్టంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు, ఖండనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరాలను తక్షణమే ఆపేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. గాజాలో సాగుతున్న యుద్ధ నేరాలకు ఇజ్రాయిల్‌ను బాధ్యురాలిని చేయాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

పాలస్తీనియన్లపై హక్కుల ఉల్లంఘనలను నివారించే లక్ష్యంతో ఈ తీర్మానం రూపొందించారు. 47 మంది సభ్యులు కలిగిన మానవ హక్కుల మండలిలో తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు రాగా, ఆరు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. భారత్ తో సహా 13 మంది గైర్హాజరయ్యారు. 

పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ ఉపయోగిస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అలాగే అటు పౌర ప్రయోజనాలకు ఇటు సైనిక ప్రయోజనాలకు ఉపయోగించగల పరికరాల దిగుమతులపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన ఇన్వెస్టిగేటర్లను మండలి కోరింది. అయితే ఈ తీర్మానానికి కట్టుబడి వుండాల్సిన అవసరం లేదు. 

అమెరికా, జర్మనీ, ఇతర దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తుండగా, కొన్ని యురోపియన్‌ దేశాలు మాత్రం అనుకూలంగా ఓటు వేశాయి. చాలా దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికాతో కలిసి ఇజ్రాయిల్‌ ఈ తీర్మానాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయిల్‌ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ తరచుగా మండలిని విమర్శిస్తోంది. మరే ఇతర దేశంపైనా చేయనన్ని తీర్మానాలను మానవ హక్కుల మండలి, ఇజ్రాయిల్‌పై చేసింది.