అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అతను ఎలా మరణించాడో ఇంకా తెలియరాలేదు. ‘ఒహాయోలోని క్లీవ్​ల్యాండ్​లో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె దురదృష్టవశాత్తు మరణించడం చాలా బాధాకరం,’ అని న్యూయార్క్​లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక పోస్ట్​ ద్వారా తెలిపారు.

ఈ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, భారత్​లోని విద్యార్థి కుటుంబంతో టచ్​లో ఉన్నామని కాన్సులేట్ తెలిపింది. ఉమా గద్దె పార్థివదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తరలించడం సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కాన్సులేట్ స్పష్టం చేసింది.

2024 ప్రారంభం నుంచి  10 మంది భారతీయ, భారత సంతతి విద్యార్థులు మరణించారు. దాడుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో మిస్సోరీలోని సెయింట్ లూయిస్​లో భారత్​కు చెందిన 34 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్ నాథ్ ఘోష్​ను దుండగులు కాల్చి చంపారు.

పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్న 23ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలోని ప్రకృతి సంరక్షణ కేంద్రంలో శవమై కనిపించాడు. ఇది తీవ్ర కలకలం సృష్టించింది. ఫిబ్రవరి 2న వాషింగ్టన్​లోని ఓ రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో భారత సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా (41) ప్రాణాలు కోల్పోయాడు.

 భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు/విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో వాషింగ్టన్​లోని భారత రాయబార కార్యాలయం, వివిధ ప్రాంతాల్లోని కాన్సులేట్ల అధికారులు అమెరికా నలుమూలల నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులతో వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించి, విద్యార్థుల శ్రేయస్సుకు సంబంధించిన వివిధ అంశాలు, పలుకబడి ఉన్న ప్రవాస భారతీయులతో కనెక్ట్ అయ్యే మార్గాలపై చర్చించారు.