భారతదేశాన్ని గ్రీన్ ఎకనామీగా మార్చడంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించి 36కోట్లకుపైగా ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం భారత్కు సాధ్యమేనా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘వందశాతం. అసాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇంధన దిగుమతులపై భారతదేశం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని పేర్కొంటూ ఈ సొమ్ముతో రైతుల జీవితాలు బాగుపడుతాయని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉపాధి లభిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సాధించేందుకు ఎలాంటి టైమ్లైన్ లేదని చెబుతూ ఈ విషయంలో వాహనదారులను ప్రోత్సహించేందుకు హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని, ఈ డిమాండ్ను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులను తగ్గించగలదని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతున్నానని చెబుతూ రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో పరిస్థితులు మారతాయని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఈ మార్పును ఎప్పటిలోగా తీసుకువస్తామో చెప్పలేనని చెప్పారు.
ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడకున్నదని, కానీ అసాధ్యం మాత్రం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. విద్యుత్ వాహనాలు ఎంత వేగంతో ప్రవేశపెడుతున్నాయో.. రాబోయే కాలంలో అంతే వేగంగా ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాలు అందుబాటులోకి వస్తాయని, ఈ కల నిజమవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
‘మన పొరుగు ఇండ్లలో ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తున్నాయి. ఇది అసాధ్యం అనుకున్న ప్రజలే తమ ఆలోచనను మార్చుకొన్నారు’ అని గడ్కరీ తెలిపారు. టాటా, అశోకా లేల్యాండ్ కంపెనీలు హైడ్రోజన్తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయని, ఎల్ఎన్జీ లేదా సీఎన్జీతో నడిచే ట్రక్కులు కూడా ఉన్నాయని గడ్కరీ తెలిపారు.
బజాజ్, టీవీఎస్, హీరో వంటి ఆటో కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఇంజిన్లను ఉపయోగించి మోటార్సైకిళ్లను తయారు చేయాలని యోచిస్తున్నాయని గడ్కరీ తెలిపారు. త్వరలో ఆటో రిక్షాలు కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించబోతున్నాయని తెలిపారు. తాను ప్రస్తుతం హైడ్రోజన్తో నడిచే కారులో ప్రయాణిస్తున్నానని తెలిపారు.
ప్రతి రెండో ఇంట్లో విద్యుత్ తో నడిచే కార్లను చూడొచ్చని, ఇది అసాధ్యం అని చెప్పేవారు ఇప్పుడు వారి ఆలోచనలను మార్చివేసిందని పేర్కొన్నారు. టాటా, అశోక్ లేలాండ్ హైడ్రోజన్తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయని చెప్పారు. ఎల్ఎన్జీ, సీఎన్జీతో నడిచే ట్రక్కులు ఉన్నాయని చెబుతూ దేశవ్యాప్తంగా 350 బయో సీఎన్జీ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిపారు. ఇంధన దిగుమతి ముగుస్తుందని, దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తుందని, ఈ విషయంలో పూర్తి విశ్వాసం ఉందని భరోసా వ్యక్తం చేశారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ