ఏప్రిల్ – జూన్ మధ్య 20 రోజులు తీవ్రమైన వడగాడ్పులు

ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 20 రోజుల పాటు తీవ్రమైన వడగాడ్పులు (హీట్‌ వేవ్స్‌ ) ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఆ సమయంలో దేశంలోని చాల ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండనున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 
 
ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా ఉండనున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 10 నుంచి 20 రోజుల వరకు తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని వీస్తాయని, సాధారణంగా 4 నుంచి 8 రోజుల మధ్య ఉండే ఆ సమయం ఈ సారి పెరగనున్నట్లు పేర్కొన్నారు. 
 
హీట్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్నాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర చత్తీస్‌ఘడ్‌, ఆంధ్రాపై ఉండనున్నట్లు ఐఎండి తెలిపింది. ఏప్రిల్‌ నెలలో ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సెంట్రల్‌, సౌత్‌ ఇండియా ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంటుందని, ఏప్రిల్‌లో గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఆంధ్రాలు హీట్‌వేవ్‌ ఉంటుందని ఐఎండి అంచనా వేసింది.
 
తెలంగాణ రాష్ట్రంలో కూడా జూన్ వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.ఏప్రిల్ నుంచి తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. 
 
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో సాధరణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి . ఏప్రిల్ నెల తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం కూడా సగటు నుండి సగటు కంటే ఎక్కువగా 88శాతం నుండి 112శాతం వరకూ ఉండనుంది. దక్షిణ ద్వీపకల్పంలోని తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
 
తెలంగాణ రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితలు ఏర్పడుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాగల 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు పెరిగి సగటున 44 డిగ్రీలు నమోదయ్యే అవాకాశాలు ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది.