హైదరాబాద్ నుండి నేరుగా అయోధ్యకు విమానం

శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆదివారం కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్లు చెప్పారు.

ఈ క్రమంలో స్పందించిన కేంద్రమంత్రి సింధియా వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు అంటే మంగళవారం, గురువారం, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
 
హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పైస్ జెట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 10:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు అయోధ్య చేరుకుంటుందని, అక్కడి నుంచి మధ్యాహ్నం 01:25 గంటలకు తిరిగి వస్తుందని వివరించారు.  అడిగిన వెంటనే తమ అభ్యర్థనపై స్పందించి తెలుగు ప్రజలకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు సింధియాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. 
 
ఈ లేఖను తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. లేఖతో పాటు హైదరాబాద్ నుంచి అయోధ్యకు బుక్ చేసుకున్న టికెట్ కూడా జతచేశారు. దీంతో అయోధ్య
బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న తెలుగు వారికి మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించినట్లైంది.