
ప్రభాకర్రావు పోలీసుల ఎదుట లొంగుబాటు? అప్రూవర్గా మారుతారా?
తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటి వరకు సంబంధం గల పోలీస్ అధికారులనే విచారిస్తుంది. ఈ కేసులో కీలకంగా ఉండి, పరారీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావు సోమవారం హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు పోలీసుల ఎదుట లొంగిపోయి, అప్రూవర్గా మారుతారనే ప్రచారం జరుగుతుంది.
మరోవైపు ఈ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల నేరాగీకారం, కస్టడీ రి పోర్టు ఆధారంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రముఖ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సదరు నేతల్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంఎల్ఎలు, ఇద్దరు ఎంఎల్సిలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దర్యాప్తులో సేకరించిన నిందితుల కాల్డేటా, వాట్సాప్ చాటింగ్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటి కంపెనీలకు చెందిన బాధితులు అందించిన సమాచారం ఆధారంగా సంబంధిత నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు.
ఇందుకు ప్రణీత్రావు, టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్రావు స్టేట్మెంట్ కీలకంగా మారినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు చెప్పిన విధంగా ఆపరేషన్స్ చేసినట్టు పోలీసు దర్యాప్తులో వీరిద్దరు వెల్లడించినట్టు సమాచారం. ఎస్ఐబి లాగర్ రూమ్ నుంచి డిఎస్పి ప్రణీత్ రావు అందించిన ఫోన్నెంబర్స్, వాయిస్ రికార్డింగ్స్ ఆధారంగా గత ఎన్నికల సమయంలో రాధాకిషన్ రావు టీమ్ స్పెషల్ ఆపరేషన్స్ చేసిన సంగతి ఇప్పటికే వెల్లడైంది.
ఇందులో అధికార పార్టీ మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు, నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఉన్న కీలక నాయకుల డబ్బులను పట్టుకున్నారు. కంపెనీల అవసరాల కోసం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న డబ్బులను కూడా సీజ్ చేశారు. ముఖ్యనాయకుల అనుచరులు, ఆర్థిక వ్యవహరాలు చూసే సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు. డబ్బుతో ప్రయాణించే వారి వివరాలతో నిఘా పెట్టారు. స్పెషల్ ఆపరేషన్లో పట్టుకుని సీజ్ చేశారు.
ఇలా స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంత మాత్రమే లెక్కలు చూపేవారని ఆరోపణలున్నాయి. పార్టీ ఫండ్, క్యాష్ ట్రాన్స్పోర్ట్ చేసేందుకే ఎస్ఐబి,టాస్క్ఫోర్స్, ఎస్వోటీ పోలీసులను వాడుకున్నారని పోలీస్ దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్, బ్లాక్ మెయిలింగ్, బడా వ్యాపార వేత్తలు, ప్రముఖ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా రూ.వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించినట్టు సమాచారం.
ఈ మేరకు నిందితులు తెలిపిన వివరాలతో బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, కంపెనీల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందుకుగాను ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరిందనే కోణంలో పరిశోధన జరుగుతున్నది. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్రావు టీమ్ ఆపరేషన్స్ ప్రారంభించింది.
గత ప్రభుత్వ పెద్దలు అందించిన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి, టాస్క్ఫోర్స్ పోలీసులకు అందించింది. దీంతో రాధాకిషన్ రావు టీమ్ ప్రతిపక్షపార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నారు. దీంతోపాటు హవాలా డబ్బును పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది హవాలా వ్యాపారులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారులు అడిగినంత అప్పగించారని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వెలుగు చూసినట్టు తెలిసింది.
వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తిరుపతన్న, భుజంగరావు వాడిన కంప్యూటర్స్, సెల్ఫోన్స్ ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరోవైపు తన ఫోన్ ట్యాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో రాధాకిషన్రావుపై ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చి రాధాకిషన్రావు రూ.కోట్లు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత