అస్సాంలో ఎఎఫ్‌ఎస్‌పిఎ మరో ఆరు నెలలు పొడిగింపు

సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు ) చట్టం -1958 (ఎఎఫ్‌ఎస్‌పిఎ)ని ఆరునెలలు పొడిగించినట్లు అస్సాం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ‘కల్లోలిత ప్రాంతాలు‘ కింద టిన్సుకియా, దిబ్రుగడ్‌, చారైడియో, శివసాగర్‌ జిల్లాల్లో ఏప్రిల్‌ 1 నుండి ఎఎఫ్‌ఎస్‌పిసిని పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని, అయితే ఈ నాలుగు జిల్లాల్లో ఒక ఉగ్రవాద సంస్థ క్రియాశీలకంగా ఉందని ఇటీవల అస్సాం పోలీసులు ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈ నాలుగు జిల్లాలను ‘కల్లోలిత ప్రాంతాలకు’గా గుర్తించి మరో ఆరు నెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖను కోరినట్లు సంబంధిత అధికారి తెలిపారు. 

దీంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుండి సెప్టెంబర్‌ 30 వరకు ఈ చట్టం అమలులో ఉంటుందని తెలిపారు. 1990 నవంబర్‌లో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం  అస్సాం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్ర కటిస్తూ ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం విధించింది.  అప్పటి నుండి వరుసగా ఆరు నెలలు పొడిగిస్తూ వచ్చింది.   2022 ఏప్రిల్‌ 1న  తొమ్మిది జిల్లాలు, కాచర్‌ జిల్లాలో కొంత భాగాన్ని మినహాయించి  రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఉపసంహరించింది.    ఇటీవల  జోర్హాట్‌, గోల్‌ఘాట్‌, కర్బి, అంగ్లాంగ్‌, డిమాహసావో జిల్లాల నుండి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంది.

కాగా, అస్సాంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 6న పర్యటిస్తారని రాష్త్ర ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఆయన లకింపుర్, హొజై లలో జరిగే బహిరంగసభలలో ప్రసంగిస్తారు. అదే విధంగా 7, 8 తేదీలలో త్రిపురలో పర్యటిస్తారు.