ఏప్రిల్‌ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌, ఈడీ వాదనలు వినిపించాయి.  మ‌ద్యం పాల‌సీ కేసులో కేజ్రీవాల్‌ను మ‌రో ఏడు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇవ్వాల‌ని ఈడీ కోరగా, ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు ఏప్రిల్‌ 1 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పును వెలువరించింది.
విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ వాంగ్మూలం ఇస్తూ సీబీఐ ఆగస్టు 17, 2022న కేసు నమోదు చేసిందని,  ఈడీ 2022 ఆగస్టు 22న ఈసీఐఆర్‌ దాఖలు చేసిందని తెలిపారు. తనను అరెస్టు చేసినా.. ఇప్పటి వరకు ఏ కోర్టు దోషిగా తేల్చలేదని గుర్తు చేశారు. తనను ఎందుకు అరెస్టు చేశారని అడగాలనుకుంటున్నానని చెబుతూ కేవలం నలుగురి ప్రకటనల్లోనే తన పేరు కనిపించిందని చెప్పారు.
ఈడీ రూ.100 కోట్ల ఆరోపణలు చేస్తున్నారని అంటూ ఈడీ విచారణ తర్వాతే అసలైన మద్యం కుంభకోణం ప్రారంభమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేయడమే ఈడీ లక్ష్యమని, ఈడీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈడీ దోపిడీ రాకెట్‌ సాగుతోందని కేజ్రీవాల్‌ పేర్కొనగా కేజ్రీవాల్‌ ప్రకటనను ఈడీ వ్యతిరేకించింది.
గోవా ఎన్నికలకు హవాలా ద్వారా డబ్బులు వినియోగించారని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ మొత్తం విచారణను గందరగోళానికి గురి చేయాలనుకుంటున్నారని.. ఈ అంశం ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ఈడీ పేర్కొంది.  గోవా ఎన్నిక‌లకు రూ.100కోట్ల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్లుగా ఈడీ ఆరోపించింది. మొబైల్ డేటాను రిక‌వ‌రీ చేసిన‌ట్లు ఈడీ పేర్కొంది. పలు డివైజ్‌లలో ఉన్న డేటాను రికవరీ చేయాల్సి ఉందని తెలిపింది.

మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ ఏ అధికారి కింద సీఎంగా కొనసాగుతున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను వివరణ కోరాలని పిటిషనర్‌ కోరారు.

అయితే, కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించలేమని.. జైలు నుంచి పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అరోరా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్‌ పిటిషన్‌ను పిటిషన్‌ను తిరస్కరించింది.