ఏపీలో ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!

అనుమతి లేకుండా ఎన్నికల వేళ ఇంటింటి ప్రచారం చేపడితే కేసులు తప్పవని ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఏపీలో రాజకీయ పార్టీలు ఖంగుతినాల్సి వచ్చింది. గతంలో ఎన్నడు లేని ఆంక్షలు, తాజా ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంపై విధించడంతో రాజకీయ పార్టీలన్ని అభ్యంతరం తెలిపాయి.

మంగళవారం ఏపీ సచివాలయంలో ఎన్నికల సంఘం ఏపీ ప్రధాన అధికారి నిర్వహించిన సమావేశంలో ఇంటింటి ప్రచారానికి 48 గంటల ముందే రూట్ మ్యాప్ అందచేయాలని, సువిధ యాప్‌లో అనుమతులు తీసుకోవాలని చెప్పడంతో పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటి వెళ్లి ఎన్నికల్లో కరపత్రాల పంపిణీ చేయడానికి, వీధుల్లో ప్రచారానికి కూడా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను పున: పరిశీలించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి.

ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబందన ఆచరణ సాధ్యం కాదని సిపిఎం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల వద్ద కూడా పార్టీ జెండాలను తొలగించడంపై సిపిఎం అభ్యంతరం తెలిపింది. కార్యాలయాల్లో బ్యానర్లు, జెండాలను తొలగించడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందడానికి సువిధా పోర్టల్ వినియోగించు కోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు.

ప్రచారానికి 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబందిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తారని చెప్పారు. ఆన్ లైన్ లో నామినేషన్లు, అఫిడవిట్ లను దాఖలు చేయడానిక, ముందస్తు అనుమతులు మంజూరు చేయడానికి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకునేందుకు సువిధా పోర్టల్ ను ఈసీఐ డిజైన్ చేసినట్టు మీనా వివరించారు.

48గంటల నిబంధనపై రాజకీయ పార్టీలన్నీ అభ్యంతరం తెలిపాయి. ప్రతిసారి రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసుకుని ఇంటింటి ప్రచారం చేపట్టడం సాధ్యం కాదని పేర్కొన్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలో ఈ తరహా నిబంధనలు లేవని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం రాలేదని పార్టీలు గుర్తు చేశాయి.

మరోవైపు టీడీపీ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం సీఈఓ స్పందించడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు. ప్రతిసారి అనుమతతులు తీసుకోవటం అభ్యంతరకరమని సీఈ ఓకి చెప్పామని,  ఇంటింటి ప్రచారంపై ఆంక్షలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.