ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎసిబి దృష్టి

 
* పరికరాల దిగుమతిలో ఓ ఎమ్యెల్సీ  ప్రమేయం!

తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసుపై ఎసిబి అధికారులు కూడా దృష్టి సారించారు.  ఫోన్ ట్యాపింగ్ ద్వారా  అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టు కున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. దీంతో పలువురు అధికారులపై ఎసిబి ఫోకస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారుల జాబితాను ఇప్పటికే ఎసిబి సిద్ధం చేసినట్లు తెలిసింది.36 మంది హవాలా ముఠాలు, గోల్డ్‌షాప్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసింది. కాల్ రికార్డింగ్స్ విని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. బెదిరించడంతో పాటు కేసులు పెడతామని సిటీ పోలీస్ బృందం భయబ్రాంతులకు గురి చేసినట్లు కూడా చెబుతున్నారు. 

విలాసవంతమైన విల్లాల్లో ఈ అధికారులు నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయా అధికారుల ఆర్థిక పరిస్థితిపై ఎసిబి ఆరా తీస్తోంది. మరోవైపు 2018, 2019, 2023 ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేల్చారు. ఇతర పార్టీలకు  చెందిన నగదు ఫ్లోటింగ్‌ను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు అండ్ టీమ్ మానిటర్ చేసినట్లు నిర్ధారించారు.

మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఎస్‌ఐబి కన్సల్టెంట్ రవిపాల్ ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక పరికరాన్ని దిగుమతి చేసుకోవడంలో సహకరించారని చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఈ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో ఓ ఎంఎల్‌సి పాత్ర తెరమీదకు వస్తోంది. 

ఇజ్రాయెల్ పరికరాలు కొని హైదరాబాద్ కు రప్పించడంలో సదరు ఎంఎల్‌సి కీలక పాత్ర పోషించారని, తన పలుకుబడి ఉపయోగించి రవిపాల్ తో ట్యాపింగ్ డివైస్‌లను తెప్పించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఎంఎల్‌సిని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది.

కాగా గతంలో రవిపాల్ ఎస్‌ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించారు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో నిఘా పరికరాలను ఇజ్రాయెల్ నుంచి రప్పించారు. నిజానికి ఇలాంటి నిఘా పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అవసరం.  అలా చేస్తే దిగుమతి చేసుకుంటున్న పరికారాలకు ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.

దాంతో ఏయే పరికారాలు తెప్పించామో అనేది సులభంగా తెలిసిపోయే అవకాశం ఉండటంతో రవిపాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైన పరికారాలను తెప్పించిటన్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు రవిపాల్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ పరికరాలను తెప్పించి వాటిని సదరు ఎంఎల్‌సికి అప్పగించగా, ఆయన వాటిని మరో ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంతో ఆ మేరకు ఫోన్ ట్యాపింగ్ లు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.