కంగనా రనౌత్‌పై సుప్రియా శ్రీనాతే అసభ్యకరమైన పోస్ట్!

బాలీవుడ్‌లో సినిమాలతోనే కాకుండా తన వ్యాఖ్యలతో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ ను ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంతో అందరి దృష్టి ఆమెపై సారిస్తున్నారు. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడూ మద్దతుగా నిలిచే కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సీటును కేటాయించారు. 

ఈ క్రమంలోనే తాజాగా కంగనపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాతే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కంగనా ధీటుగా జవాబు ఇచ్చారు. అంతేకాకుండా బీజేపీ పరివారం నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో సుప్రియా శ్రీనాతే వెనక్కి తగ్గారు. తన అకౌంట్ నుంచి ఎవరో ఆ వాఖ్యలు  పెట్టారని తెలిపారు. అయినా బీజేపీ నేతలు శాంతించడం లేదు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ శ్రీనాతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కంగనా రనౌత్ సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఓ ఫోటోను షేర్ చేసిన ఆమె ఇలాంటి ఫోటోలతో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ ప్రజలకు కంగనా ఏం సందేశం ఇస్తున్నారంటూ కింద క్యాప్షన్ పెట్టారు. అయితే అది చూసిన కంగనా రనౌత్ తనదైన శైలిలో ధీటుగా  బదులిచ్చింది.

ఒక ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించినట్లు కంగనా ట్వీట్ చేసింది. `నేను క్వీన్‌ చిత్రంలోని అమాయక అమ్మాయి నుంచి ధాకడ్‌ సినిమాలో గూఢచారిగా.. మణికర్ణిక సినిమాలో దేవతగా.. చంద్రముఖి సినిమాలో దయ్యంలా.. రజ్జో చిత్రంలో వేశ్యగా.. ఇక తలైవి సినిమాలో విప్లవ నాయకురాలిగా నటించాను’ అని గుర్తు చేసింది. 
 
ఆడబిడ్డలను పక్షపాతం అనే సంకెళ్ల నుంచి మనమే విడిపించాలని పేర్కొంది. మహిళల శరీర భాగాల పట్ల ఉండే ఉత్సుకత కంటే, వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవాలని సూచించారు. అన్నింటికీ మించి మహిళల జీవితాలను, వారి పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలని, ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు అని మనం గ్రహించాలంటూ గట్టిగా సమాధానం చెప్పింది.
కంగనాపై అభ్యంతరకర వాఖ్యలు పోస్టు చేసిన సుప్రియతో పాటు హెచ్ ఎస్ అహిర్ లపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ వ్రాసారు.
 
ఇది చూసిన కంగనా ఫ్యాన్స్, అభిమానులు, బీజేపీ శ్రేణులు కంగనాకు మద్దతుగా, సుప్రియా శ్రీనాతేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలతో ఆ పోస్ట్‌ను సుప్రియ శ్రీనాథే తొలగించారు. అయినా దాని స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రోల్స్‌పై ఎట్టకేలకు స్పందించిన సుప్రియా శ్రీనాతే వివరణ ఇచ్చారు. తన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు కొంతమందికి ఇచ్చానని, వారు ఆ ఫోటో, క్యాప్షన్ పెట్టారని తెలిపారు. తాను మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తానో సన్నిహితులకు, తనను చూసిన వారికి తెలుసని పేర్కొ్న్నారు. ఈ క్రమంలోనే తన పేరుతో పేరడీ ట్విట్టర్‌ అకౌంట్ ఉందని, దానిపై రిపోర్ట్ చేసినట్లు తెలిపారు.