జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలపై ఈడీ విచారణ

* ఈడీ కస్టడీ నుంచి సీఎంగా రెండోసారి ఆదేశాలు

జైలు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జారీ చేసినట్లు చెబుతున్న ఉత్తర్వులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దృష్టి పెట్టింది. ఒకవేళ కేజ్రీవాల్‌ ఈ ఉత్తర్వులను జారీ చేస్తే అవి ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు ఇడికి, కేజ్రీవాల్‌కు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఉన్నాయా? లేదా? అనే విషయంపై విచారణ చేయనుంది.
 
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఉత్తరువులు సైతం జారీ చేసేశారు. ఈ పరిణామాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీవ్రంగా తప్పుబట్టింది. 
 
కస్టడి సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని ఈడీ వెల్లడించింది. అవి ఎలా లోపలికి వచ్చాయో, ఆదేశాలు ఎలా బయటకు వచ్చాయి అనే విషయంపై సమాచారం తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆప్‌ మంత్రి ఆతిశీని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో 55 ఏళ్ల కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఇడి అరెస్టు చేసింది. కోర్టు ఈ నెల 28 వరకూ కేజ్రీవాల్‌కు కస్టడీ విధించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మధ్యలో అరగంట పాటు భార్య సునీతా కేజ్రీవాల్‌, వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను కలవడానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఇచ్చింది. మరో ఆరగంట పాటు తన న్యాయవాదులను కలవడానికి అనుమతి ఇచ్చింది.
 
కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తనకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి అతిషి ఆదివారం ప్రకటించారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఎదురువుతున్న నీటి, మురుగు నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు తగినన్ని నీటి ట్యాంకర్లను తరలించాలని కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. 
 
ఈ ఉత్తర్వులపై ఇడి విచారణ చేయనుంది. ప్రస్తుతం కస్డీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన గురించి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ప్రైవేట్‌ భాగస్వాములతో జరిపిన సమావేశాల గురించి ఇడి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సహాయకులు, సిబ్బంది వినియోగించిన మొబైల్‌ ఫోన్లుపైనా ఇడి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
మరోవంక,  కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టగా, ఇదే సమయంలో తాజాగా సీఎం మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు.  మంగళవారం ఉదయం లాకప్‌ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ నేత, దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ”కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని కొన్ని మొహ‌ల్లా క్లినిక్‌లు, ఆస్ప‌త్రులు ఉచిత మందులు ఇవ్వ‌డం లేద‌ని, కొన్నింటిల్లో ఫ్రీ టెస్టులు నిర్వ‌హించ‌డం లేద‌న్న విష‌యాన్ని కేజ్రీవాల్ త‌న‌కు చెప్పార‌ని, ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న త‌న‌ను కోరిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.