ఇంధన ధరలు తగ్గిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ ఇంధన ధరల తగ్గింపు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.
కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.100 తగ్గించింది. ఇదే బాటలో పెట్రోల్, డీజిల్ ధరలనూ తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోవటంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోంది.
నిత్యవసర వస్తువుల ధరలు సైతం పెరగటంతో మూడు పూటలా కడుపు నిండా తినలేకపోతున్నారు. ఈ క్రమంలో తగ్గిన ఇంధన ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. ఇంధన ధరలు తగ్గించడం ద్వారా కోట్లాది మంది భారతీయులు, వారి కుటుంబ సంక్షేమం, సౌలభ్యమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా సవరిస్తున్నట్లు సమాచారం ఇచ్చాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. సవరించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ ఇంధన ధరల తగ్గింపుతో వాహనదారులకు ఊరట కలుగుతుందని తెలిపింది.
డీజిల్తో నడిచే 58 లక్షల గూడ్స్ వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల బైక్లకు ఈ తగ్గింపుతో ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. లీటర్ పెట్రోల్పై రూ.2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72.. ముంబైలో రూ.104.21.. కోల్కతా రూ.103.94.. చెన్నై రూ.100.75 కి తగ్గనుంది. ఇక డీజిల్ ధరల విషయానికి వస్తే ఢిల్లీలో రూ.87.62.. ముంబైలో రూ.92.15.. కోల్కతాలో రూ.90.76, చెన్నైలో 92.34 కి తగ్గనుంది.
More Stories
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
ఐటీ రంగంలో కొత్త నియామకాలపై నీలినీడలు