ఏపీపీఎస్సీలో భారీ కుంభకోణం వెల్లడించిన హైకోర్టు తీర్పు

2018 గ్రూప్-1 పరీక్ష  పేపర్ల మూల్యాంకనంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతో పాటు పరీక్షను రద్దు చేయడంతో ప్రస్తుతం గ్రూప్‌ 1 అధికారులుగా ఉన్న 143 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లైంది.  పైగా, ఈ తీర్పు ఉద్యోగ నియామకంలో ఏపీపీఎస్సీ భారీ కుంభకోణం జరిగినట్లు స్పష్టం చేస్తున్నది.
 
ఇటీవలే తెలంగాణలోనూ ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. పేపర్ లీక్ కారణంగా ఓ సారి తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా, మరోసారి పరీక్షను నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. బయోమెట్రిక్ విధానంలోని పలు సమస్యలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి రద్దు చేయాల్సి వచ్చింది.      
 
ఆంధ్ర ప్రదేశ్ లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై మార్చి 13న రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
జవాబు పత్రాలను రెండు సార్లు మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో మూల్యాంకనం చేశారంటూ ఆరోపించారు. దీనిని విచారించిన కోర్టు గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 
 
ఇప్పటికే ఈ పోస్టులకు ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారు కోర్టు ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటామని తెల్పుతూ అఫిడవిట్‌ ఇచ్చినట్లు కోర్టు గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం కీలక తీర్పు ఇచ్చారు.
 
కాగా 162 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2018లో డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ వెలువరించింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారందరికీ మెయిన్స్  నిర్వమించారు. వీటి జవాబు పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం చేసి, 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చింది. ఆ తర్వాత మొదటిసారి మాన్యువల్‌ మూల్యాంకనంలో వారిలో 202 మందిని అంటే దాదాపు 62 శాతం మందిని అనర్హులుగా నిర్ణయించింది.
 
జవాబు పత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని అభ్యర్ధులు ప్రశ్నించారు. వీటిని రెండోసారి కూడా మాన్యువల్‌ మూల్యంకనం చేసినట్లు పిటషనర్లు ఆధారాలతో సహా రుజువు చేశారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను పక్కదారి మళ్లించి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసి 6 నెలల్లోపు మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల తరఫున న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది.