కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యాన్ని4 శాతం పెంచింది. ఈ నిర్ణయానికి  కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్ల డియర్నెస్ రిలీఫ్ 50 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఇది 46% గా ఉంది.

కేంద్రం నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖాజానాపై అదనంగా రూ.12,868.72 కోట్లు భారం పడనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

కేబినెట్ నిర్ణయాలను మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.  మరోవైపు.. కేబినెట్ కీలక నిర్ణయాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 సబ్సిడీ పథకాన్ని 2025, మార్చి 31 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. 

దీని ద్వారా కేంద్రంపై అదనంగా మరో రూ.12 వేల కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మరోవైపు.. 2024-25 సీజన్ కి సంబంధించి జూట్ కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపారు. క్విటాలుకు రూ.285 పెంచినట్లు తెలిపారు. దీంతో క్విటాలు జూట్ ధర రూ. 5,335కు చేరింది.