కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు

కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు
మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 16న తమ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 
 
గత నాలుగు నెలల్లో సుమారు ఎనిమిదిసార్లు ఈడీ అధికారులు ఆప్‌ సుప్రిమోకు సమన్లు పంపారు. మద్యం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే, ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈడీ బుధవారం కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కావడం లేదని తెలిపింది. 
 
ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్‌ ఇప్పటికే అంగీకరించారు. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు.
 
 మద్యం పాలసీ కేసులో గతేడాది నవంబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌జీ వీకే సక్సేనా మద్యం పాలసీని రద్దు చేసి.. సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇందులో ఈడీ మనీలాండరింగ్‌ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.