మార్చి త్రైమాసికంలో ఎల్‌ఐసీ లాభం రూ.23,400 కోట్లు

మార్చి త్రైమాసికంలో  ఎల్‌ఐసీ లాభం రూ.23,400 కోట్లు

ప్రభుత్వరంగంలోని బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) లాభాల్లో తన సత్తాను చాటుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో దేశీయ ఫైనాన్షియల్‌ రంగంలో అత్యధిక లాభాన్ని ప్రకటించిన సంస్థగా ఎల్‌ఐసీ నిలిచింది. ఈ త్రైమాసికానికి ఎల్‌ఐసీ ప్రకటించిన నికర లాభం రూ.23,400 కోట్లకుపైగా ఉంది. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పోల్చినా ఎల్‌ఐసీ నాలుగో త్రైమాసిక లాభంపరంగా నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఎల్‌ఐసీ తర్వాతి స్థానాల్లో దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బీఐ), రెండో అతిపెద్ద బ్యాంకు అయిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు నిలిచాయి. నాలుగో త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.19,684 కోట్లు, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు రూ.19,221 కోట్ల లాభాన్ని ప్రకటించాయి. 
 
వార్షిక లాభం విషయానికి వస్తే మాత్రం ఎల్‌ఐసీ కన్నా ఎస్‌బీఐ ముందుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ నికర లాభం రూ.80,032 కోట్లు ఉండగా.. ఎల్‌ఐసీ లాభం రూ.57,419 కోట్లుగా ఉంది. అలాగే హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు లాభం రూ.74,670 కోట్లు ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంకు లాభం రూ.50,147 కోట్లుగా ఉంది. 
 
ఇక ప్రభుత్వరంగ సంస్థల (పీఎ్‌సయూ) విషయానికి వస్తే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నాలుగో త్రైమాసిక నికర లాభం రూ.11,378 కోట్లు ఉండగా, కోల్‌ ఇండియా లాభం రూ.10,839 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) లాభం రూ.8,598 కోట్లు, ఎన్‌టీపీసీ లాభం రూ.8,747 కోట్లు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.4,546 కోట్లు, ఆర్‌ఈసీ లాభం రూ.3,375 కోట్లు, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లాభం రూ.1,680 కోట్లుగా ఉంది. 
 
మొత్తం కార్పొరేట్‌ రంగాన్ని పరిగణనలోకి తీసుకుంటే టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా జనవరి-మార్చి త్రైమాసికంలో అత్యధికంగా రూ.51,970 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.