సోషల్ మీడియా ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబమే లేదంటూ ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో `మోదీ కా పరివార్’ (మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోదీ అభిమానులు సోమవారం సోషల్ మీడియాలో తమ మద్దతును చాటుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి మద్దతుగా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలే కాకుండా ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు మోదీ కా పరివార్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ట్విటర్ అకౌంట్‌లో పేరు పక్కన మోదీ కా పరివార్ అనే పదాన్ని ఉంచి.. మోదీకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. 

దీంతో ట్విటర్‌లో మోదీ కా పరివార్ తెగ ట్రెండ్ అవుతోంది. తాము అందరం ప్రధాని మోదీకి మద్దతుగా.. ఆయన కుటుంబ సభ్యులమేననే తెలియజేయడానికే వారు ఇలా చేస్తున్నారు. ఇక లాలూకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని పేర్కొన్నారు.

ఆదివారం పాట్నాలో జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ల్రాలూ ప్రసాద్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బిజెపి సోమవారం ఎదురుదాడి ప్రారంభించిది. మోదీ అభిమానులతోపాటు పలువురు సోషల్ మీడియా యూజర్లు ప్రధాని మోడీకి మద్దతుగా తమ పేజీలలో మార్పులు చేశారు. 

ప్రధాని మోదీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, గత 16, 17 ఏళ్లుగా ఇటువంటి కుత్సితమైన ఆరోపణలు చేస్తున్నారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సావేశంలో మండిపడ్డారు. ఇండియా కూటమి నాయకుల సమక్షంలో ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ మరోసారి ఆదివారం ప్రధాని మోదీపై ఇటువంటి అల్పమైన వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు. 

ఇది చాలా బాధాకరం, విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ కుటుంబం గురించి లాలూ మాట్లాడారని, యావద్దేశం మోదీ కుటుంబమేనని లాలూకు గుర్తు చేయదలచుకున్నానని త్రివేది చెప్పారు. ప్రధాని మోదీకి మద్దతుగా పార్టీ నాయకులు ఏకం కావడం ఇది మదటిసారి కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈ రకమైన పరిణామమే చోటుచేసుకుంది. 

`చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బిజెపి నాయకులు, మోదీ అభిమానాలు `మై భీ చౌకీదార్’ (నేను కూడా రక్షకుడిని) అంటూ సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ  నిజాయితీ, అవినీతికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న వైఖరిని కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగిన ప్రచారం మోదీ ప్రతిష్టను పెంచడమే గాక గత ఎన్నికల్లో ఆయనను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చింది.

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఏమాత్రం పనిచేయకపోగా గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  మోదీ ఆ ప్రకటన చేసిన కొద్దీసేపటికే బిజెపి నాయకులు, అభిమానులు తమ ప్రొఫైల్స్‌లో `మోదీ కా పరివార్’ అని చేర్చారు. ఈ బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీల వారసత్వ రాజకీయాలను కూడా ప్రధాని ఎండగట్టారు. వాటి ముఖాలు వేరైనప్పటికీ  జుఝాట్, లూట్ (అబద్ధాలు, దోపిడీ)లో అందిరీ ఒకే కరమైన స్వరూపమని ఆయన ఆరోపించారు.

ఇక తనపై లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ సభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు.. వీరంతా తన కుటుంబ సభ్యులేనని తేల్చి చెప్పారు. దేశంలోని ప్రతీ పేద వ్యక్తి తన కుటుంబమేనని.. ఎవరూ లేనివారికి మోదీ ఉన్నారని.. మోదీకి వారంతా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. 

“మేరా భారత్‌ – మేరా పరివార్‌” అనే భావనతోనే తాను జీవిస్తున్నానని.. లాలూకు మోదీ దీటుగా సమాధానం ఇచ్చారు. తాను ప్రజల కోసం పోరాడుతున్నానని.. తన జీవితం తెరిచిన పుస్తకమని తెలిపారు. తానెంటో దేశ ప్రజలకు తెలుసని.. ప్రతి క్షణం ప్రజలకు సేవ చేసేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. ప్రజల కలలే తన ఆశయాలని.. వాటిని నెరవేర్చేందుకు నిరంతరం కష్టపడుతానని మోదీ తెలిపారు.