పాక్ ప్రధానిగా వరుసగా రెండోసారీ షెహబాజ్‌ షరీఫ్‌

పాకిస్థాన్ ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారీ పాక్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ ( పార్టీ అగ్రనేత షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. 72 ఏళ్ల షెహబాజ్‌ దేశ 33వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి షహబాజ్‌ నేతృత్వం వహించనున్నారు.
 
ఆదివారం ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్థాన్‌ అసెంబ్లీ సమావేశమైంది. పీఎంఎల్‌-ఎన్, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకూటమి తరఫున షెహబాజ్‌ ప్రధాని పదవికి పోటీపడ్డారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ అభ్యర్థి ఒమర్‌ అయూబ్‌ఖాన్‌ బరిలో దిగారు. జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిఖ్ ఈ ఎన్నిక ఫలితాలను ప్రకటించారు. పాకిస్తాన్ 24వ ప్రధానిగా షెహబాజ్‌ను నియమిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
 మొత్తం 336 మంది సభ్యుల ఓట్లలో షహబాజ్‌ 201 ఓట్లు పొందారు.  జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీకి చెందిన ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ కేవలం 92 ఓట్లు మాత్రమే పొందారు. షహబాజ్‌ మార్చి 4న రాష్ట్రపతి భవనం ఐవాన్‌-ఎ-సదర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షహబాజ్‌ 2022 ఏప్రిల్‌ నుండి ఆగస్టు 2023 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేశారు. సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ పార్లమెంటను రద్దు చేశారు.

పిటిఐ మద్దతు ఉన్న ఎంపిల నినాదాలు, రభస మధ్య కొత్త పార్లమెంట్ సెషన్ మొదలైంది. పిటిఐ మద్దతు ఉన్న ఎంపిలు ‘ఆజాదీ’, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను సూచిస్తూ ‘ఖైదీ నం 804’ అని నినాదాలు చేశారు. పిటిఐ మద్దతు ఉన్న ఎంపిలు కొందరు ఇమ్రాన్ ఖాన్ పోస్టర్లను ప్రదర్శించారు. ఇమ్రాన్ అనుకూల నినాదాలకు ప్రతిగా పిఎంఎల్‌ఎన్ ఎంపిలు ‘లాంగ్ లివ్ నవాజ్’ అని నినాదాలు చేయడమే కాకుండా ఇమ్రాన్ ఖాన్‌పై గల తొషఖానా అవినీతి కేసును సూచిస్తూ రిస్ట్‌వాచీలను ప్రతిపక్షాల బెంచ్‌ల వైపు ప్రదర్శించారు.

ప్రధాని పదవి ఎన్నికలో షెహబాజ్‌కు అనుకూలంగా వోటు వేసిన తొలి వ్యక్తి పిఎంఎల్‌ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్. పిఎంఎల్‌ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఓటమిని ఒప్పుకుని ఉంటే మర్యాదగా ఉండేదని ఎన్నికకు ముందు పిటిఐ వ్యాఖ్యానించింది. ‘కాని ఆయన హేయనీయమైన జీవితం సాగించేందుకు నిశ్చయించారు. ప్రతి రోజు ఈ పరాజితుల కూటమికి, ముఖ్యంగా నవాజ్ షరీఫ్, మరియంలకు గతంలో కన్నా హీనంగా ఉంటుంది’ అని పిటిఐ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నది.