నాగ్‌పూర్‌లో 15 నుండి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15-17 తేదీలలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌లోని రేషిమ్ బాగ్‌లోని ‘స్మృతి భవన్’ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో, 2023-24 సంవత్సరంలో సంఘ్ చేసిన అన్ని కార్యక్రమాలు, సేవా కార్యాలను సమీక్షిస్తారని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 
 
2024-25 సంవత్సరానికి సంఘ్  ప్రణాళికపై కూడా విస్తృత చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సర్ సంఘచాలక్, ఇతర అఖిల భారతీయ కార్యకర్తల పర్యటనలపై చర్చ జరుగుతుంది. అలాగే, స్వయంసేవకుల శిక్షణ కోసం కొత్త సంఘ్ శిక్షా వర్గ్ ప్రణాళిక అమలును పరిశీలిస్తారు.  పని విస్తరణ ప్రణాళికను బలోపేతం చేయడంతో పాటు, రాబోయే శతాబ్ది సంవత్సరం (2025) కార్యక్రమాలపై చర్చ జరుగుతుంది.
దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యమైన అంశాలపై కూడా తీర్మానాలు ఆమోదిస్తారని అంబేకర్ వివరించారు.  సంఘ్ ప్రతినిధి సభ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏటా జరుగుతుంది. ప్రతి మూడవ సంవత్సరం ప్రతినిధి సభ నాగ్‌పూర్‌లో జరుగుతుంది. 45 ప్రాంత్ ల  నుంచి 1500 మంది ప్రతినిధులు ప్రతినిధి సభలో పాల్గొంటారు.
 
సర్ సం చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, సహా సర్ కార్యవహ్ లు, అఖిల భారతీయ కార్యకారిణి, క్షేత్ర – ప్రాంత్ కార్యకారిణి, అఖిల భారతీయ ప్రతినిధి, అన్ని విభాగ ప్రచారక్ లు, ఆహ్వానించిన ఆర్ఎస్ఎస్  ప్రేరేపిత సంస్థల కార్యకర్తలు పాల్గొంటారు.