రమణ దీక్షితులుపై టీటీడీ కేసు

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. 
 
ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ అధికారి మురళీ సందీప్‌ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు సెక్షన్‌ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్‌విత్‌ 120 మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం. 
 
మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణదీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది. ఇదిలా ఉండగా చాలాకాలం తరువాత శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి ఆలయంలో రమణదీక్షితులు ప్రత్యక్షమయ్యారు. 
 
శ్రీవారిని దర్శించుకుని సుమారు గంటపాటు ఆలయంలోనే గడిపిన ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కనిపించారు. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన అనంతరం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆలయంలో కైంకర్యాలు సక్రమంగానే జరుగుతున్నాయా అనే ప్రశ్నకు బదులిస్తూ.. తరతరాలుగా చేసే కైంకర్యాలనే ఇప్పటికీ చూస్తున్నామని, ఇందులో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు.
 
సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో తనది కాదని ఇప్పటికే స్పష్టత ఇచ్చానని తెలిపారు. తానెప్పుడు అలా మాట్లాడలేదని, అది తన స్వభావం, సంస్కృతి కాదని స్పష్టం చేశారు. చేయని తప్పునకు తనను బాధితుడిని చేస్తే ఏం చేయలేనన్నారు. పోలీసు కేసు అంశంపై మీడియా ప్రశ్నించగా ‘చూస్తాను’ అంటూ వెళ్లిపోయారు.