200కు పైగా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు

భారత నౌకాదళానికి రూ.19,000 కోట్ల వ్యయంతో 200కు పైగా బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణులను, దానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయడానికి కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఆమోదం తెలిపినట్లు వ్యవహారం గురించి తెలిసిన అధికార వర్గాలు గురువారం తెలిపాయి. 

నౌకాదళం పోరాట పాటవాన్ని పెంపొందించేందుకు ఈ క్షిపణులను వివిధ యుద్ధ నౌకలపై మోహరిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. సిసిఎస్ ఆమోదం తెలిపిన దాని ప్రకారం దాదాపు 290 కిలోమీటర్ల నుంచి తాజాగా రూపొందించిన 450 కిలోమీటర్ల రేంజి కలిగిన అధునాతన బ్రహ్మోస్ క్షిపణులున్నాట్లు తెలుస్తోంది. 

భారత్ రష్యా జాయింట్‌వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, భూమి లేదా లాంచ్ ప్లాట్‌ఫామ్‌లనుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు శబ్దానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి.

ఈ క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై రాబోయే కొద్ది నెలల్లో కుదుర్చుకోవడం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. మన దేశం బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి కూడా చేయనుంది. 2022 జనవరిలో ఫిలిప్పీన్స్‌కు ఈ క్షిపణుల ఎగుమతికి సంబంధించి 375 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్షిపణుల సరఫరా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. అర్జెంటీనాతో పాటుగా మరికొన్ని దేశాలు కూడా మన దేశంనుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.