రూ. 1.25 లక్షల కోట్లతో సహకార రంగంలో గిడ్డంగులు

దేశంలోని రైతన్నలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో వేలాది గోదాములు, గిడ్డంగులను నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నట్టు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు చెప్పారు

11 రాష్ట్రాలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంస్థ (పిఎసిఎస్)లలో 11 గిడ్డంగులకు ప్రధాని ప్రారంభోత్సవం చేశారు.  500 పిఎసిఎస్‌లలో గిడ్డంగులు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన కూడా చేశారు.  ‘ఇప్పుడు మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల పథకాన్ని ప్రారంభించాం. దీని కింద దేశవ్యాప్తంగా వేలాది గిడ్డంగులు, గిడ్డంగుల నిర్మాణం జరుగుతుంది’ అని తెలియజేశారు. దేశంలో నిల్వల మౌలిక వసతుల కొరత కారణంగా రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 

‘పూర్వపు ప్రభుత్వాలు ఈ సమస్యపై తగినంత శ్రద్ధ వహించలేదు. కాని ఇప్పుడు పిఎసిఎస్‌ల ద్వారా ఈ సమస్యను పరిహరిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహారధాన్యాల నిల్వ పథకం కింద వచ్చే ఐదు సంవత్సరాలలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థం ఏర్పడగలదు. ఈ పథకంపై రూ.1.25 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాం’ అని ప్రధాని వెల్లడించారు.

భారీ నిల్వ సదుపాయాల సృష్టిలో రైతులు తమ ఉత్పత్తులను గోడౌన్లు/గిడ్డంగులలో నిల్వ చేసుకోగలుగుతారని, వాటిపై సంస్థాగత రుణం పొందగలుగుతారని, గిట్టుబాటు మార్కెట్ ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకోగలరని మోదీ తెలిపారు. వంట నూనెలు, పప్పు ధాన్యాలతో సహా ఆహార సరకులు, ఎరువుల దిగుమతులను తగ్గించేందుకు కృషి చేయవలసిందిగా సహకార సంస్థలను ప్రధాని కోరారు. 

సహకార సంస్థల్లో ఎన్నికల విధానంలో పారదర్శకత తీసుకురావలసిన అగత్యం ఉందని కూడా మోదీ ఉద్ఘాటించారు. దీని వల్ల మరింత మంది ప్రజలు సహకార ఉద్యమంలో పాల్గొనేందుకు ఊతం లభిస్తుందని ప్రధాని సూచించారు. ‘సహకార్ సే సమృద్ధి’ లక్షంలో భాగంగా సహకార రంగం వృద్ధికి గత పది సంవత్సరాలలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల గురించి ప్రధాని తెలియజేశారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ద్వారా దేశంలో సహకార సంస్థల పటిష్ఠతకు కృషి జరుగుతోందని  చెప్పారు.