దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రదారులను బీజేపీ వదలదు

వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ విధులను సక్రమంగా సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేస్తూ, లేదంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారుల సస్పెన్షన్ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికలలో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రదారులను బీజేపీ వదలదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ హెచ్చరించారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలని, ఓ రాజకీయ పార్టీకో, రాజకీయ నేతలకో అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ పార్టీ పట్ల కాదనే విషయాన్ని గుర్తించాలని పురందేశ్వరి హితవు పలికారు.

ఉమ్మడి పార్టీలతో పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆధారాలుతో సహా దొంగ ఓట్లు వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెబుతూ నకిలీ ఎపిక్ కార్డులపై సమాచారాన్ని బీజేపీ దృష్టి కి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లు తో గట్టెక్కాలని చూస్తోందని, తక్కువ మార్జిన్ తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రకు అధికార పార్టీ నాంది పలుకుతోందని పురందేశ్వరీ అనుమానం వ్యక్తం చేశారు.  వైసీపీ నేతలు – కొందరు అధికారులు కుమ్మక్కై ఓటర్ల జాబితాలో అవకతవలు చేస్తున్నారని పేర్కొంటూ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయగలరని ఆమె ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకి తెలియచేశామని ఆమె చెప్పారు. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి ప్రజలతో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించామని పురందేశ్వరి తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది ఒక గొప్ప కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, ఈ ఆలయ నిర్మాణం జరిగితే హిందూ – ముస్లీంల మధ్య గొడవలు తలెత్తుతాయన్న విమర్శలని తిప్పి కొట్టగలిగామని ఆమె గుర్తు చేశారు. 

వివాదాలకు తావు లేకుండా ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది జరిగిందని, ప్రజా పూరి యాత్ర కూడా బీజేపీ శ్రీకారం చుట్టిందని పురందేశ్వరీ వివరించారు. ప్రతి జిల్లాలో అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిధులు ఇచ్చిందని, బీజేపీ కే ప్రజలు పట్టం కట్టాలని ఆమె పిలుపునిచ్చారు. 

అలాగే రాష్ట్రంలోని నకిలీ ఓటు కార్డు లు జారీ చేసారో ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెబుతూ వలంటీర్లను పోలింగ్ ఏజెంట్స్ గా వినియోగుంచుకుంటాం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషనే వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించిందని ఆమె గుర్తు చేశారు. 

వలంటీర్లను ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికలకు దూరంగా ఉంచాలని తాము కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె చెప్పారు.  తిరుపతి ఉపఎన్నికల్లో తప్పుడు దారిలో గెలిచిన వ్యక్తిపై అనర్హుడిగా గుర్తించి ఎన్నికను రద్దు చేయాలనీ ఎన్నికల దృష్టికి గతంలోనే తీసుకెళ్ళామని పురందేశ్వరీ వివరించారు.