నేటి నుంచి విశాఖలో “మిలాన్‌ 2024”

నేటి నుంచి విశాఖలో “మిలాన్‌ 2024”
* దేశ విదేశాల నౌకదళాల రాకతో కోలాహలం
 
అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలకు విశాఖ నగరం వేదిక కానుంది. 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ నగరం తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్‌-2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్‌ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.

మిలాన్‌ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్‌ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్‌లో నిర్వహించ నున్నారు. ఈ పరేడ్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్‌-2024 విన్యాసాలను `స్నేహం-ఐక్యత-సహకారం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. బీచ్‌ రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పెరేడ్‌కి లక్ష మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని నేవీ అధికారులు అంచనా వేశారు.

30 ఎన్‌క్లోజర్లు, 30 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాట్లు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నా రు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోస్తు తదితరాలను పోలీసు విభాగం ఆధ్వర్యంలో చేపట్టా రు. బీచ్‌ ప్రాంతంలో బార్‌కేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు రెండు దశల్లో మిలాన్‌ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిలాన్‌ విన్యాసాల్లో పాల్గొనేందుకు 15 దేశాలకు చెందిన ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి.

మిలాన్‌ కోసం వచ్చిన యుద్ధ నౌకల్లో మేరీటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూడా ఉంది. ఇండియన్‌ నేవీ నుంచి 20 యుద్ధనౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు విక్రాంత్‌, విక్రమాదిత్య , పీ8ఐ నిఘా విమానం, మిగ్‌ 29 యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. రెండు దశల్లో జరగనున్న మిలాన్‌ వేడుకలకు వేలాది మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు.

వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణం, స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యాలకు తమ బలం, బలగం గురించి తెలియజేసేందుకు ‘మిలాన్‌’ పేరుతో 1955 నుంచి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండొనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి.

ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ‘మిలాన్‌’లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్‌ విన్యాసాలు రద్దు చేయగా 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలు నిర్వహించడం వల్ల ఈ విన్యాసాలు జరగలేదు. ఈ విన్యాసాల్లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా, 2012లో అనూహ్యంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2022లో విశాఖలో నిర్వహించిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా, 2023లో అండమాన్‌లో జరిగిన విన్యాసాల్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి ఏకంగా 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.