రష్యాలో అనూహ్యంగా మృతి చెందుతున్న పుతిన్ విమర్శకులు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను విమర్శించిన వాళ్లు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి మరణాలు అనేకం సంభవించాయి. తాజాగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా మృతి చెందాడు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
నావల్నీ మృతికి పుతిన్‌ కారణమని ఆయన భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడా దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ను విమర్శిస్తే ఏదో ఒక రూపంలో మృత్యువు ముంచుకు రావడమనేది అంతుచిక్క,ని అంశంగా మారింది.

ప్రిగోజిన్‌

రష్యా కిరాయి సైన్యంగా పేరొందిన వాగ్నర్‌ గ్రూప్‌నకు ప్రిగోజిన్‌ నాయకత్వం వహించాడు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ గ్రూప్‌ కీలకంగా వ్యవహరించింది. గత ఏడాది చివర్లో రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే దీనిపై వెనక్కి తగ్గిన ప్రిగోజిన్‌ బెలారస్‌లో ఆశ్రయం పొందారు. 

పుతిన్‌, ప్రిగోజిన్‌ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు.

బోరిస్‌ నెమత్సోవ్‌

రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్‌ను 2015లో క్రెమ్లిన్‌ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో చెచెన్‌కు చెందిన ఐదుగురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. 2014లో క్రిమియాను ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్‌ పాల్గొన్నాడు. అంతేగాక పుతిన్‌ నిర్ణయాలపై తరచుగా విమర్శలు చేశాడు.

అన్నా పొలిట్‌కోవ్‌స్కాయ

రష్యన్‌ జర్నలిస్ట్‌ అన్నా పొలిట్‌కోవ్‌స్కాయను 2006లో ఆమె అపార్ట్‌మెంట్‌లో కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్‌లపై తరచూ ఆమె విమర్శలు చేసేవారు. అప్పట్లో అన్నా మృతి తర్వాత రష్యాలో ప్రతికా స్వేచ్ఛపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

అలెగ్జాండర్‌ లిట్వినెంకో

అలెగ్జాండర్‌ లిట్వినెంకో రష్యన్‌ ఫెడరల్‌ సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసేవారు. 1999లో మాస్కో అపార్ట్‌మెంట్‌ బాంబు దాడులకు పుతిన్‌ కారణమని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు. 2006లో లండన్‌లో ఇద్దరు రష్యన్‌ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత ఆయన మరణించారు. అలెగ్జాండర్‌ తాగిన టీలో విషం కలిపారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.

వీళ్లేగాక మరికొందరు కూడా అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడగా, ఇంకొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా వ్యాపారవేత్త, ఎంపీ ఆంటోవ్‌ 2022 డిసెంబరులో ఒడిశాలోని రాయగడ హోటల్‌లో మరణించారు. అంతకు కొద్దిరోజుల ముందు నౌకా రంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ బుజెకోవ్‌ ఒక సబ్‌మెరైన్‌ ఫ్లోటింగ్‌ ఫంక్షన్‌లో హఠాత్తుగా మృతిచెందారు. 

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లుక్‌ ఆయిల్‌ ఛైర్మన్‌ రావిల్‌ మాగ్నోవ్‌ గది కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్‌ప్రామ్‌ యూనిఫైడ్‌ సెటిల్మెంట్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ట్యూల్కోవ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్‌ విమర్శకుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటివరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్‌పై విమర్శలు చేసిన వారే.