ఎన్నికల నిర్వహణకుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి 

ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్లమెంట్‌తోపాటు కొన్ని  రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఒడిశాలో పర్యటించిన ఆయన చెప్పారు.
 
లోక్‌సభతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నుంచి చేరికలు, ఎన్నికల ప్రచారాలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో దేశంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నడుస్తోంది. 
 
 ఈ క్రమంలోనే సాలోక్‌సభతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజీవ్ కుమార్ తాజాగా స్పష్టం చేశారు. ఇక ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. 22,685 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 
 
300 పోలింగ్ స్టేషన్లు వికలాంగుల కోసం ఏర్పాటు చేసినట్లు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్ కుమార్ చెప్పిన మాటల ప్రకారం చూస్తూ వచ్చే నెలలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఏప్రిల్‌లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పరిశీలన పూర్తైందని, ఎన్నికల కోసం అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. ఈవీఎంలు అన్నింటినీ తనిఖీ చేసి పోలింగ్ కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఈ రెండు ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

 
ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రత విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల వేళ ఉండే డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, ప్రత్యేక సిబ్బందితో సోదాలు, దాడులు చేస్తున్నట్లు వివరించారు. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొరికిన డబ్బు చూస్తేనే ఏ స్థాయిలో తనిఖీలు చేపట్టామో అర్థం అవుతుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించటానికి సర్వం సిద్ధం చేశామని, షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే ఏ ఏ తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.