ఎన్నారైలు, భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల ఉదంతాలపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాలలోని భారతీయ సంతతివారు (ఎన్నారై), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఒసిఐ)లు ఇక్కడి పౌరులను మనువాడే క్రమంలో తలెత్తే పలు సమస్యలు, చట్టపరంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై న్యాయ మంత్రిత్వశాఖకు లా కమిషన్ తమ నివేదిక అందించింది.
ఇటువంటి వివాహాలను భారత్లో అనివార్యంగా నమోదు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ ప్యానల్ ఛైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థీ విలేకరులతో మాట్లాడుతూ అక్రమాలకు దారితీస్తున్న ఈ పరిణయాలతో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత చట్టం పూర్తిస్థాయిలో సమగ్రరీతిలో ఉండాలని తెలిపారు.
దీనితో ఇటువంటి వివాహాలతో తలెత్తే సమస్యలకు సరైన పరిష్కారం ఏర్పడాల్సి ఉందని ఆయన చెప్పారు. ఎన్నారైలు ఇక్కడి మహిళలను పెళ్లిచేసుకోవడం, ఈ దశలో పలు ఉదంతాలలో మహిళలు దారుణ పరిస్థితులకు గురి కావడం జరుగుతోందని, ఇటువంటి విషయాలు తమ దృష్టికి వచ్చాయని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు నివేదిక ముందస్తు ప్రస్తావనలో తెలిపారు.
విడాకుల చట్టంలోని అంశాలను అన్వయింపచేయాల్సి ఉందని చెప్పారు. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని మోసగించే ఎన్నారైలపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం సంక్రమించేలా చట్టంలో నిబంధనలు ఉండాలని సూచించారు. బాధితులకు భరణం, విడాకులు , పిల్లల పోషణ, మోసానికి పాల్పడి విదేశాలకు వెళ్లిపోయినవారికి సమన్ల జారీ, వారంట్లు పంపించడం, చట్టపరమైన కేసులను దాఖలు చేయడం వంటివి చేపట్టేందుకు తగు నిబందనలు ఉండాలని న్యాయమంత్రికి తెలిపారు.
ఇటువంటి వివాహాల దశలో భార్యాభర్తలిద్దరి పాస్పోర్టులపై వివాహ ధృవీకరణ పత్రం వివరాలు నెంబరును పొందుపర్చాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి అనువుగా పాస్పోర్టు చట్టం, 1967లో అవసరం అయిన సవరణలు తీసుకురావాలని అభ్యర్థించారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా