మేడిగడ్డ బ్యారేజీకి మూడేళ్లలోనే వ్యయం రెట్టింపు

* మధ్య మధ్యలో సర్దుబాట్ల కారణంగా రూ 2472 కోట్ల భారం
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా జరిగిన అవినీతి తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతుండగా, ఈ ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ఖర్చు మూడేళ్లలోనే రెట్టింపైనట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. కాగ్ నివేదికను గురువారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ అంచనా వ్యయం, అలాగే మొదట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా మధ్య మధ్య పనులలో సర్దుబాట్లు చేయటం వల్ల అదనంగా రూ.  2472 కోట్ల భారం పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణాన్ని ఆగస్టు 2016న  ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్టు ఒప్పందం విలువ రూ. 1849.31 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం బ్యారేజి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.కానీ మార్పులు చేర్పుల పేరిట ఒప్పందంలో పేర్కొన్న ధరను రూ. 4321.44 కోట్లకు పెంచారు. అంటే ఏకంగా 2472.13 కోట్లు పెంచారు. అంటే మొదటి ఒప్పందం కంటే కూడా పెంచిన ధరే 135 శాతం ఉంది.

ప్రాజెక్ట్ లింక్ -1లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మూడు కొత్త బ్యారేజీలు నిర్మించారు. ఆగస్టు 2016లో పనులు మొదలవగా, జూన్ 2019 నాటికి ఈ మూడు బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీని 80,000 క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ చేసే సామర్ధ్యంతో నిర్మించారు. అన్నారం బ్యారేజీని 65,000 క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీని 57,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యంతో నిర్మించారు.

అయితే నిర్మాణం పూర్తయిన కొన్ని నెలలకే  2019 నవంబరులో వరదలు రాగా బ్యారేజీల గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు. గేట్లు మూసిన తరువాత బ్యారేజీల్లో కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయాయి. ఆర్సీసీ వేరింగ్ కోట్, సీసీ కర్టెన్ వాల్స్‌లో కొంత భాగం, బ్యారేజీ దిగువ భాగంలో నిర్మించిన సీసీ బ్లాక్స్ వరదలో కొట్టుకుపోయాయి. దీనివల్ల వాటిల్లిన నష్టం రూ. 180.39 కోట్లు. 

వరద ఉధృతికి ఈ నిర్మాణాలు కొట్టుకుపోయాయని, ఆ ఉధృతిని తట్టుకునే సామర్ధ్యంతో వాటిని నిర్మించలేదని డిపార్ట్మెంట్ పరిశీలనలో తేలింది. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కాంట్రాక్టు ఏజెన్సీలు తిరస్కరించాయి. డిపార్ట్మెంట్ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే తాము వాటిని నిర్మించామని ఏజెన్సీలు పేర్కొన్నాయి. పైగా వాటికి క్వాలిటీ సెర్టిఫికెట్లు కూడా ఇచ్చారని చెప్పాయి.

దీనివల్ల వాటిల్లిన నష్టం 180.39 కోట్లు, దానికి అదనంగా మరమ్మతు ఖర్చు 476.03 కోట్లు.  ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ నిబంధనల ప్రకారం హెడ్ వర్క్స్ ఖర్చు‌లో ఒక శాతం మెయింటెనెన్స్‌కు ఖర్చు పెట్టాలి.  ఏడాదికి అయ్యే ఖర్చును తగ్గించటానికి డిపార్ట్మెంట్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఒప్పందాల విలువల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఖర్చు రూ. 4550.40 కోట్లు. ఇది పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏడాదికి ఈ మూడు బ్యారేజీల హెడ్ వర్క్స్ నిర్వహణ వ్యయం మొత్తం రూ. 45 కోట్లు మాత్రమే.