కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశంలో నివసిస్తున్న కోటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ను అందజేయడం. ఈ పథకం గురించి ఇటీవలె ముగిసిన పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

ఈ పథకంలో భాగంగానే నెలకు 300 యూనిట్ల వరకు కరెంటు వినియోగించుకున్న కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కరెంటును సరఫరా చేస్తారు. ఇక ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.

దేశంలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా బడ్జెట్‌లో ఈసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనికోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం అమలులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.  దేశంలోని కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజనను ప్రారంభించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేశారు. ఈ పథకం వర్తించేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

దేశంలో మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఈ పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌ కారణంగా దేశంలోని కోటి కుటుంబాలకు ప్రతీ నెలా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 
 
ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీతో రుణాలు కూడా పొందొచ్చని తెలిపారు. ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని హామీ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
అయితే గ్రామస్థాయిలో కూడా ఈ పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ పథకానికి మరింత ప్రచారం కల్పించేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఆయా సంస్థలు తమ పరిధిలో ఈ రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ప్రోత్సహించాలని వెల్లడించారు.  ఈ పథకంతో విద్యుత్‌ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పథకం కోసం pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని మోదీ తెలిపారు.