లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్కి మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు తెలుపుతూ తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోల్కు పంపించారు.
అలాగే అశోక్ చవాన్ భోకర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్పీకర్ రాహుల్ నార్వేకర్ను కలిసి ఎమ్యెల్యేగా తన రాజీనామాను అందజేశారు. కొద్దిరోజుల్లో బిజెపిలో చేరేందుకే అశోక్ కాంగ్రెస్కి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయనకు బిజెపి రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతుంది.
అయితే, తనను ఇప్పటి వరకు ఏ పార్టీ వారు సంప్రదింపలేదని, తన భవిష్యత్ రాజకీయ యాత్ర గురించి 48 గంటలలో తెలుపుతానని ఆయన మీడియాకు తెలిపారు.
కాగా, మహారాష్ట్రలోని సీనియర్ నేతలంతా కాంగ్రెస్ని వీడుతున్నారు. గతనెల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ని వీడి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. మళ్లీ కొద్దిరోజుల్లోనే మరో సీనియర్ నేత అశోక్ కాంగ్రెస్ను వీడడం గమనార్హం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్రావు చవాన్ కుమారుడే అశోక్ చవాన్.
ఈయనకు నాందేడ్ ప్రాంతంలో గణనీయమైన ప్రభావం ఉంది. ఈ మార్పు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని దెబ్బతీయవచ్చు. అశోక్ కాలేజీ రోజులలో విద్యార్థి నాయకునిగా ఉన్నారు. కాంగ్రెస్లో కూడా కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగానూ పనిచేశారు.
ఆయన రెండుసార్లు నాందేడ్ నుంచి ఎంపీగా గెలిచారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల తర్వాత విలాస్రావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం అశోక్ చవాన్ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. అయితే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో 2010లో అశోక్ తన సిఎం పదవికి రాజీనామా చేశారు.
కాగా, కేంద్ర ఆర్ధిక మంత్రి గత వారం పార్లమెంట్ ముందుంచిన శ్వేతపత్రంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం గురించి ప్రస్తావించడంతో తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయం తన వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంటూ అందుకు ప్రత్యేకంగా ఎటువంటి కారణం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కు చవాన్ రాజీనామాపై స్పందిస్తూ “ఏం జరుగుతుందో వేచి చూడండి” అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నర్మగర్భంగా చెప్పారు.
More Stories
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
రాహుల్ తో చర్చకు బిజెపి రాయబరేలి యువనేత!
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత