మోదీ పాల‌న‌లో బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపాంత‌రం

* ఆర్ధిక మంత్రి శ్వేతపత్రం
యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, స్వల్పకాలిక ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకొన్నదని ఆరోపించింది.2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనపై మోదీ సర్కారు రూపొందించిన శ్వేతపత్రాన్ని గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
పత్రాన్ని చదివి వినిపించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, ఎన్డీయే పదేండ్ల పాలనలో దేశం ఎంతో గొప్పగా ఆర్థిక ప్రగతి సాధించిందని చెప్పుకొచ్చారు. యూపీఏ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడటంతో ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయిందని విమర్శించారు. మౌలిక వసతుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, సామాజికాభివృద్ధి పథకాలకు నిధులను సక్రమంగా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
యూపీఏ పదేండ్ల పాలనలో సగటు ద్రవ్యోల్బణం 8.2 శాతంగా ఉండేదని, దానిని తగ్గించేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు ఎంతో ఆరోగ్యంగా, 7 శాతం వృద్ధితో దూసుకుపోయిన ఆర్థిక వ్యవస్థను.. ఆ తర్వాత పదేండ్లలో తిరోగమనంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. 
నిర్మలా సీతారామన్ శ్వేతపత్రంలో యూపీఏ ప్రభుత్వం, ఎన్డీయే ప్రభుత్వ పనితీరును పోల్చారు. 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిందని పేర్కొంటూ 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సంక్షోభాలను ఆ పత్రంలో ఆమె ప్రస్తావించారు. 
2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భలమైన స్థితిలో , ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిపారు.
ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని, ఇది సంక్షోభ పరిస్థితి అని శ్వేతపత్రంలో వివ‌రించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వేసిన బలమైన ఆర్థిక పునాదులను, సంస్కరణల వేగాన్ని వినియోగించుకోవడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విఫలమైందని ఆరోపించారు. దశాబ్ధ కాలాన్ని ఆర్థిక సుస్థిర కోసం ఉపయోగించుకోలేదని విమర్శించారు. 
 
యూపీఏ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ని చింపివేయడం సిగ్గుచేటని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆర్ధిక మంత్రి ధ్వజమెత్తారు.  యూపీఏ అధికారం చేపట్టినప్పుడు భారత్ వృద్ధి రేటు 8 శాతం ఉందని, 1991 ఆర్థిక సంస్కరణల క్రెడిట్ తీసుకోవడంలో విఫలమైన యూపీఏ నాయకత్వం, 2004లో వాటిని పూర్తిగా విడిచిపెట్టిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 

యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండంకెల ద్రవ్యోల్భణం, ప్రభుత్వ ఆర్థిక నిర్వహాణా లోపాలను, విదేశీ మారకద్రవ్య సంక్షోభాలతో పాటు ఇతర వైఫల్యాలను శ్వేతపత్రంలో హైలెట్ చేశారు. 2004-2014 మధ్య సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు దాదాపు 8.2% అని శ్వేతపత్రం పేర్కొంది, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి యుపిఎ ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు.

యూపీఏ హయాంలో కామన్వెల్త్, 2జీ కుంభకోణాలను జ‌రిగాయని గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం 4 జీ ద్వారా ప్రజలు విస్తృత కవరేజీ అందిస్తోందని, జీ20 వంటి సమావేశాలను అత్యుత్తమంగా నిర్వహించినట్లు నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. భారత్ వద్ద రికార్డు స్థాయిలో 620 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపింది.