వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది ప్రమాదకర బుజ్జగింపు ధోరణికి దారితీసే ప్రమాదం ఉన్నదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ర్టాలకు లేదన్న 2004నాటి సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేస్తున్నప్పుడు రాష్ట్రం ఇతరులను మినహాయించలేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. ఉదాహరణకు వెనుకబడిన తరగతులు అధికంగా ఉన్నట్టయితే, రాష్ట్రం కేవలం రెండింటిని మాత్రమే ఎంచుకోగలదా? అని ప్రశ్నిస్తూ రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి మినహాయించబడిన వారు ఆర్టికల్ 14 ప్రకారం వారి వర్గీకరణను ఎప్పుడైనా సవాల్ చేయవచ్చు అని తెలిపింది.
వెనుకబాటు తనం ఏ మేరకు ఉన్నదో చూసి కులాన్ని వర్గీకరించవచ్చని చెప్పింది. అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నట్టు చెప్పింది. కానీ అత్యంత వెనుకబడిన వారికి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు ఇతరులను మినహాయించలేరని, ఇది అత్యంత ప్రమాదకరమని ధర్మాసనం పేర్కొంది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కులాలను ఎంచుకుంటే మరికొన్ని రాష్ర్టాలు మరికొన్ని కులాలను ఎంపిక చేస్తాయి. అసలు ఈ ఆలోచన ప్రజాదరణ రాజకీయాల కోసమా? తామే ప్రమాణాలను నిర్దేశించడం ద్వారా దీన్ని సరిదిద్దుతామని ధర్మాసనం పేర్కొన్నది. కేంద్రం, రాష్ర్టాలు, తదితరుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది.
రిజర్వేషన్లు కల్పించటం, సామాజిక వెనుకబాటు తనాన్ని తొలగించటం, ఆ పని చేస్తూనే సామాజికంగా ఎదుర్కొంటున్న అసమానతలను తొలగించడం రాష్ట్రం పాత్ర అని ధర్మాసనం తెలిపింది. బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు, ఫెడ్యూల్డ్ తెగల ను రాష్ట్రాల వారీగా ఉప వర్గీకరించవచ్చని 2020లో జస్టిస్( రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఉంది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల తరగతిలో మరో తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి అధికార పరిధిలో ఉంటుంది. ఒకే అంశంపై రెండు బెంచ్లు భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈ అంశంపై ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణ జరుగుతోంది.
More Stories
మూడు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి