మాల్దీవుల్లో భారత సైనికుల స్థానంలో సాంకేతిక సిబ్బంది

మాల్దీవుల్లో భారత సైనికుల స్థానంలో సాంకేతిక సిబ్బంది

భారత్, మాల్దీవుల మధ్య దౌత్య పరమైన వివాదం కొనసాగుతన్న నేపథ్యంలో మే 10 లోగా మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలు మొత్తం వెళ్లిపోవాలని స్పష్టం చేస్తుండడంతో మాల్దీవుల్లో పనిచేస్తున్న భారత సైనికుల స్థానంలో సమర్థులైన టెక్నికల్ సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న సుమారు 75 మంది భారత సైనికులను సమర్థులైన టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్దీవుల్లో ఉన్న 2 భారత హెలికాప్టర్ల మెయింటెనెన్స్, మాల్దీవులు ప్రజలకు వైద్యం, మానవతా సాయం కోసం పనిచేసే భారత సైనికులను, సమర్థవంతమైన ఇండియన్ టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేస్తామని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. 

ఇందు కోసం త్వరలోనే భారత్, మాల్దీవుల మధ్య మూడో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు బడ్జెట్‌లో నిధుల తగ్గింపుపై సవరణ జరుగుతుందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా మాల్దీవులకు ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామిగా భారత్‌ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.

మాల్దీవుల్లో ప్రస్తుతం సుమారు 75 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. వీరిని మార్చ్ 15 నాటికి వెనక్కి పిలిపించుకోవాలని గతేడాది చివర్లో కొత్తగా ఎన్నికైన చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, దానిపై మాల్దీవులు మంత్రులు, ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య రెండు దశల్లో అత్యున్నత స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం గురించి కూడా చర్చించాయి. మార్చ్ 15 నాటికి ఒక విమాన స్థావరంలోని సైనిక సిబ్బందిని భారత్‌ భర్తీ చేస్తుందని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. 
అలాగే మే 10 వ తేదీ నాటికి మిగతా సైనిక స్థావరాల్లోని మొత్తం సిబ్బందిని సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు రెండో సమావేశం తర్వాత పేర్కొంది. ఈ నెల చివరి నాటికి మూడో సమావేశం కూడా జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.