ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌ నౌకలపై ప్రతీకార దాడులు

యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ చేస్తున్న వైమానిక దాడులకు హౌతీ తిరుగుబాటుదారులు ఏమాత్రం బెదరడంలేదు. అమెరికా, బ్రిటన్‌ తమపై ఎన్ని దాడులు చేసినా తగ్గేదేలే అన్నట్టుగా ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలపై దాడి చేసినట్లు హౌతీ మిలిటెంట్స్‌ ప్రకటించారు.

అమెరికా నౌక ‘స్టార్‌ నాసియా’పై తొలి బ్రిటిష్‌ నౌక ‘మార్నింగ్‌ టైడ్‌’పై తాము దాడి చేశామని హౌతీ మిలిటెంట్స్‌ ప్రతినిధి యాహ్య సారె తెలిపారు. బ్రిటన్‌ నౌకపై దాడిని ఆ దేశ సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ కూడా ధ్రృవీకరించింది. 

యెమెన్‌లో హౌతీల ఆధీనంలోని హుడేడా పోర్టు నుంచి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్‌ టైడ్‌ నౌక స్వల్పంగా దెబ్బతిన్నదని పేర్కొన్నది. అయితే నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపింది. బార్బడోస్‌ జెండాతో వస్తున్న నౌక బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధి దాటగానే స్పీడ్‌ పెంచినప్పటికీ హౌతీల దాడికి చిక్కిందని బ్రిటన్‌ పేర్కొంది. 

నౌకపై యాంటీ షిప్‌ మిసైల్‌తో దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌక బ్రిటన్‌లోని ఫురాడినో కంపెనీకి చెందినదిగా గుర్తించారు. దాడి జరిగినా తమ నౌక ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తోందని ఫురాడినో కంపెనీ ప్రకటించింది.

కాగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్‌ దేశాలు ఇటీవల వారి స్థావరాలపై దాడులను తీవ్రతరం చేశారు. రెండు దేశాల సేనలు గత వారం హౌతీ స్థావరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. వాణిజ్య నౌకలపై దాడికి సిద్ధంగా హౌతీలు సిద్ధంగా ఉంచుకున్న క్షిపణులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి.