కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు జరిమానా

కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, కేబినెట్‌ మంత్రులు ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. తమపై నమోదైన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సిఎం సిద్ధరామయ్య, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ బెంచ్‌ మంగళవారం కొట్టివేసింది. నలుగురిని ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. 

మార్చి 6న సీఎం సిద్ధ రామయ్య, 7న రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, 11న కాంగ్రెస్‌ కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్‌ సూర్జేవాలా, 16న పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ కోర్టులో హాజరుకావాలని చెప్పింది. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2022 ఏప్రిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ బెలగావి వాసి కాగా, ఆయన ఉడిపిలోని హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  అయితే, తాను చేసిన పనులకు ఈశ్వరప్ప కమిషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపించారు. ఈశ్వరప్ప ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో మంత్రి రాజీనామా చేయాలని అప్పటి కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. అప్పటి సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, అనుమతి లేకుండా వెడుతున్నారని డీకే శివకుమార్‌తో సహా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

తమపై నమోదైన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వారు చట్టానికి లోబడి ఉంటే మిగిలిన వ్యక్తులు చట్టానికి కట్టుబడి ఉంటారని పేర్కొంటూ ఆంగ్లంలో ఒక వాఖ్యాన్ని ఉదాహరించింది. “క్రిమినల్ లాలో ప్రధాన మంత్రి, పోస్ట్‌మ్యాన్ ఒకే విధమైన హోదా కలిగి ఉంటారు“. 
 
కాబట్టి, బెంగళూరులో పగటిపూట పబ్లిక్ రోడ్లపైకి వెళ్లడం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని, అలా చేయవద్దని చెప్పినందుకు ఓ పోలీస్ అధికారిని ఆమె వ్యక్తిగత హోదాలో తమ పిటీషన్ లో ప్రతివాదిగా పేర్కొన్నందుకు హైకోర్టు ఈ జరిమానా విధించింది.