గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడిన ఏపీ పోలీసులు

నేరాలను కట్టడి చేయాల్సిన పోలీసులే గంజాయి స్ముగ్గ్లింగ్ కు పాల్పడి దొరికిపోయిన ఘటన జరిగింది. కాకినాడలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులు   సెలవుపై వచ్చి మరీ అత్యాశతో హైదరాబాద్ లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతూ తెలంగాణ పోలీసులకు చిక్కారు.  

కాకినాడలోని థర్డ్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ (35), కానిస్టేబుల్ శ్రీనివాస్(32) పనిచేస్తున్నారు. నెలా నెలా వచ్చే జీతంతో సరిపెట్టుకోలేక  ఒకేసారి భారీగా డబ్బులు సంపాదించడానికి నేరాల బాట పట్టారు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా లక్షలకు లక్షలు సంపాదించవచ్చనే అత్యాశతో ఈ ఇద్దరు పోలీసుల కాస్త స్మగ్లర్లుగా మారారు.

అనారోగ్య కారణాలు చెప్పి పోలీస్ జాబ్ కు సెలవుపెట్టిన సాగర్, శ్రీనివాస్‌లు నర్సీపట్నంలో గంజాయిని సేకరించారు. ఈ గంజాయిని స్వయంగా ఈ ఇద్దరే కారులో హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటి పోలీసులు కాపుకాసారు. 

అర్ధరాత్రి వీరిద్దరూ బాచుపల్లికి చేరుకోగానే ఒక్కసారిగా దాడిచేసి వాహనంలోని 22 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సాగర్, శ్రీనివాన్‌లను అదుపులోకి తీసుకున్న ఎస్వోటి పోలీసులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో వారు చెప్పిన వివరాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. వారివద్ద పట్టుబడిన గంజాయి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.