సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఆ పిటిషన్‌ను విచారించేందుకు  సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోమని, ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. కాగా భూ కుంభకోణంలో తన అరెస్టు అక్రమమంటూ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 
 
తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు.​ 
 
దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌లు సంజీవ్‌ఖన్నా, ఎంఎం సుందరేష్‌, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. సొరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర హైకోర్టులు రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానాలని, ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

హేమంత్‌ సోరెన్‌ను బుధవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేయగా, గురువారం ఆయనను ఒక రోజు జ్యూడిష కస్టడీకి రాంచీలోని పిఎంఎల్‌ఎ కోర్టు పంపింది. ఆయనను  అయితే పదిరోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. సోరెన్‌కు ఈడీ కస్టడీని ఐదు రోజులకు పొడిగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.గురువారం ఆయన్ను ఇక్కడి హోత్వార్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్ భవన్‌లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్ తరువాత పిటిషన్‌ని వెనక్కి తీసుకుని సుప్రీం తలుపు తట్టారు.