వచ్చే వారం నుంచి కిలో రూ.29కే భారత్‌ రైస్‌ అమ్మకాలు

వచ్చే వారం నుంచి కిలో రూ.29కే భారత్‌ రైస్‌ అమ్మకాలు
దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్యులకు తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టనున్నట్లు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. వచ్చే వారం నుంచే ‘భారత్‌ రైస్‌’ పేరిట కిలో బియ్యం రూ.29కే విక్రయించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. 
 
ఈ మేరకు బియ్యం నిల్వలు ఎంత మేర ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని ఆదేశించింది.  దేశంలో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ధరల కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా శుక్రవారం వెల్లడించారు. 
 
ఈ ‘భారత్‌ రైస్‌’ను నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, కేంద్రీయ భండార్  రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించ‌నున్నట్టు వెల్లడించారు. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కూడా భారత్‌ రైస్‌ను విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే వారం నుంచి 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌ల రూపంలో భారత్‌ రైస్‌ అందుబాటులోకి రానుంది. తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్‌ మార్కెట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక ఇప్పటికే ‘భారత్‌ ఆటా’ పేరుతో గోధుమ పిండిని కిలో రూ. 27.50కి, ‘భారత్‌ దాల్‌’ పేరుతో పప్పులను రూ.60కి రాయితీ ధరలతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.