అమృతకాలంలో వికసిత భారత లక్ష్యాలకు రాచబాట

వికసిత భారత సంకల్ప లక్ష్యాలను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబించిందని చెబుతూ  అమృత్ కాల్ లో భారతదేశం సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించుకుని, వాటిని చేరుకునేందుకు ఏయే రంగాల్లో దృష్టి సారించాలో తెలియజేసేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ప్రజాకర్షక పథకాల బడ్జెట్ కాకుండా, దేశ  అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ ఇదని తెలిపారు.

ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలనే సంకల్పంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ మౌలిక వసతుల రంగంపై చేయాల్సిన వ్యయాన్ని 11.1%, అంటే  రూ. 11.11 లక్షల కోట్లు పెంచిన్నట్లు వెల్లడించారు.  సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియకు ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టారని, కోటి ఇళ్లకు సోలార్  ప్యానెళ్లను అమర్చడం ద్వారా ప్రతి నెలా ఒక్కో ఇంటినుంచి 300 యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో పనిచేయనున్నారని తెలిపారు.

మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారని గుర్తించి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రుణసదుపాయం కల్పించనున్నారని వెల్లడించారు.  దీంతోపాటుగా ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనలో భాగంగా నిర్దేశించుకున్న 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకున్నందున, మరో 2 కోట్ల ఇళ్లను వచ్చే ఐదేళ్లలో నిర్మించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని వివరించారు. 

దేశవ్యాప్తంగా 83 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 9 కోట్ల మంది మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిలో చాలా మంది ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచి కనీసం 2 కోట్ల మందిని లక్షాధికారులుగా చేయాలన్న టార్గెట్‌ను 3 కోట్లకు పెంచారని, తద్వారా మహిళాసాధికారతను మరో మెట్టు పెంచనున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రఖ్యాత పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయడంతోపాటుగా వాటిని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడంపైనా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారని ఆయన హర్షం ప్రకటించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల్లో పోటీ తత్వాన్ని పెంచి వారిని ప్రోత్సహించనున్నారని, లక్షద్వీప్ వంటి ద్వీపప్రాంతాల్లో పర్యాటక మౌలిక వసతుల కల్పన కు పెద్దపీట వేస్తూ ఆయా ప్రాంతాలకు అనుసంధానత పెరిగేలా చర్యలు తీసుకోనున్నారని చెప్పారు.
40వేల సాధారణ రైలు బోగాలను వందేభారత్ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారని తెలిపారు.

2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్నటువంటి రూ.25వేల వరకు ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్, 2010-11 నుంచి 2014-15 వరకు ఉన్నటువంటి రూ.10వేల ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించడంతో కోటి మంది పన్ను చెల్లింపుదారులకు మేలు జరగనుందని చెప్పారు.