మేడారం జాతరకు పర్యావరణ రుసుం మినహాయింపు

రాష్ట్రం నలుమూలల నుంచి మేడారానికి వస్తున్న భక్తులకు టోల్ గేట్ ఫీజులని, పర్యావరణ రుసుములంటూ అదనపు భారం పడుతోంది. దీనిపై ఇప్పటికే చాలా మంది ప్రభుత్వానికి విన్నవించుకోగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు  అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

మరోవైపు, ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ రుసుము వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ కూడా ప్రకటించింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారంల నుంచి వచ్చే భక్తుల వాహనాల నుంచి పర్యావరణ రుసుమును అటవీ శాఖ వసూలు చేసింది. ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్లిక్‌ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగించనుంది.  జాతర సందర్భంగా మేడారానికి పోటెత్తుతున్న భక్తుల విజ్జప్తుల మేరకు. జాతర ముగిసే వరకు ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీ శాఖ విజ్ఞప్తు చేస్తోంది.