నలుగురు మొస్సాద్ ఏజెంట్లకు ఇరాన్‌లో మరణ శిక్ష

ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేయడమే కాక, ఇరాన్ లోని ఇస్ఫాహాన్‌లో బాంబుదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై మొసాద్ సంస్థకు చెందిన నలుగురికి సోమవారం ఇరాన్‌  ఉరితీసింది. డాన్‌ సిటీలో నలుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేసినట్లు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.  మహమ్మద్ పరమార్థి, మొహసీన్ మజ్జమ్, వాఫా అజర్బార్, పిజ్‌మన్ ఫతేహ్ అనే ఈ నలుగురిని ఏడాదిన్నర క్రితం మొసాద్ సంస్థ నియమించుకుని, ఆఫ్రికా దేశాలకు తరలించింది.

అక్కడ సైనిక కేంద్రాల్లో ఇజ్రాయెల్ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు.  వీరు ఇరాన్ దేశ రక్షణ విభాగానికి చెందిన కీలక ప్రదేశాలను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్టు ఇరాన్ కోర్టు నిర్ధారించింది. ఇరాన్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ లోని ఓ స్థావరంలో కుట్రకు ప్రయత్నించారన్న ఆరోపణలపై 2022 లో వీరిని అరెస్ట్ చేశారు.

2023 సెప్టెంబర్‌లో ఈ నలుగురికి మరణ శిక్ష విధించినట్టు న్యాయశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో తమ బాలిస్టిక్ క్షిపణి ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి మొసాద్ పన్నిన కుట్రను భగ్నం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఇస్సాహాన్ లోని తమ సైనిక స్థావరంపై ఇజ్రాయెల్ డ్రోన్‌తో దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది.

కాగా, గత నెలలో కూడా ఇరాన్‌ ఒక మహిళ, నలుగురు పురుషులను ఉరితీసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అనుకూలంగా పనిచేసిన కేసులో వీరు దోషులుగా తేలారు. డిసెంబర్‌ ఆరంభంలో కూడా కీలక సమాచారాన్ని మొస్సాద్‌కు చేరి వేశాడన్న ఆరోపణలపై  ఒక మొసాద్ ఏజెంట్‌ను జెహెదాన్‌లో ఉరి తీసినట్టు ఇరాన్ వెల్లడించింది.

బ్రిటన్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇటీవలనే రక్షణ శాఖ మాజీ ఉద్యోగి అలీరెజా అక్బరీకి ఇరాన్ మరణ శిక్ష విధించింది.  ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాలు గత కొన్నేళ్లుగా గూఢచర్యానికి సంబంధించి ఒకరినొకరు నిందించుకుంటూ వస్తున్నారు. ఏళ్ల తరబడి రెండు దేశాల మధ్య ఈ షాడో యుద్ధం కొనసాగుతూనే ఉంది.