19 మంది పాకిస్థానీల‌ను ర‌క్షించిన భారత నౌకాదళం

సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నౌకా దళం మరోసారి విఫలం చేసింది. భార‌తీయ నౌకాద‌ళం రెండు రోజుల్లోనే మ‌రో  భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరెట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌక‌ను ర‌క్షించింది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఆ రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది.

హైజాక్ అయిన ఆ నౌక‌లో 19 మంది పాకిస్థానీ నావికులు ఉన్నారు. వారంద‌ర్నీ ర‌క్షించిన‌ట్లు భారత నౌకాదళం ప్ర‌క‌టించింది. ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో భారత నౌకాదళంకు చెందిన మెరైన్ క‌మాండోలు పాల్గొన్నారు. హిందూ మ‌హాస‌ముద్రం ప్రాంతంలో భార‌తీయ యుద్ధ నౌక‌లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నాయ‌ని ర‌క్ష‌ణ అధికారులు తెలిపారు.

సొమాలియా తూర్పు తీరంతో పాటు గ‌ల్ఫ్ ఆఫ్ ఎడ‌న్‌లో యాంటీ పైర‌సీ, మారిటైం సెక్యూర్టీ ఆప‌రేష‌న్స్, పెట్రోలింగ్‌ కోసం యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర‌ను భార‌తీయ నౌకాద‌ళం మోహ‌రించింది. కొన్ని రోజుల క్రిత‌మే ఇఆర్‌కు చెందిన ఫిషింగ్ నౌక ఇమాన్‌ను పైరేట్స్ ప‌ట్టుకున్నారు. ఆ స‌మ‌యంలో కూడా ఐఎన్ఎస్ సుమిత్ర రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.

సోమాలియా సముద్రపు దొంగల వద్ద బందీలుగా చిక్కుకు పోయిన మొత్తం  సిబ్బందిని సురక్షితంగా విడిపించి బయటకు తీసుకు వచ్చింది. ఇరాన్‌కు చెందిన చేపల బోటును సోమాలియా పైరెట్స్ హైజాక్‌ చేసినట్లు ఇండియన్ నేవీకి సమాచారం అందింది.  దీంతో వెంటనే రంగంలోకి దిగిన భారత నౌకా దళం ఏడెన్‌ జలసంధి, సోమాలియా తూర్పు తీరం వెంబడి విధుల్లో ఉన్న ఐఎన్‌ఎస్‌ సుమిత్రా యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. 

వెంటనే ఆ ఇరాన్ చేపల బోటును అడ్డుకున్న ఇండియన్ నేవీ హెలికాప్టర్ల ద్వారా దాన్ని చుట్టుముట్టింది. ఆ తర్వాత సోమాలియా సముద్రపు దొంగలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తోక ముడిచిన ఆ సోమాలియా పైరెట్స్ ఇరాన్ బోటును వదిలేశారు. దీంతో ఆ పడవతో పాటు అందులో ఉన్న 17 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించిందనిని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి.

గత కొన్ని రోజులుగా అరేబియా సముద్రం, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. దీంతో సముద్రంలో గస్తీని భారీగా పెంచేసింది. మన దేశ నౌకలకే కాకుండా ఇతర దేశాలకు చెందిన నౌకలపై జరుగుతున్న దాడులను కూడా భారత నౌకా దళం సమర్థవంతంగా తిప్పి కొడుతూ ఆ దేశాలకు అండగా నిలుస్తోంది. 

ఇటీవల హౌతీలు చేసిన దాడుల ధాటికి మంటల్లో చిక్కుకుపోయిన ఓ బ్రిటన్‌ నౌకను ఆదుకున్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అందులోని 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక దేశస్థులను కాపాడింది. ఇక ఈనెల 17 వ తేదీన ఏడెన్‌ జలసంధిలో డ్రోన్‌ దాడికి గురైన ఎంవీ జెన్కో పికార్డే నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది. అంతకుముందు ఎంవీ లీలా నార్‌ఫోక్‌ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌ చేయగా  రంగంలోకి దిగిన భారత నౌకా దళం వారి ఆటకట్టించింది.