బీజేపీపై షర్మిల మాటల అంతరార్థం?

పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు.. ముఖ్యంగా క్రిస్టియన్లు, మణిపూర్ అంశాలతో పాటు కేంద్రంలో అధికార భారతీయ జనతాపార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తన అన్నపై అక్కసుతో కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన షర్మిల జగన్ మోహన్ రెడ్డి విధానాలపై విమర్శల వరకు పరిమితం కాకుండా,
భారతీయ జనతా పార్టీని పదే పదే టార్గెట్ చేయటం వెనుక కాంగ్రెస్ పార్టీ లోతైన రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు తాను జగన్ రెడ్డి వదిలిన బాణాన్ని అని చెప్పుకు తిరిగిన షర్మిల.. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ సమాజం, భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ వదిలిన బాణంగా వారు అభివర్ణిస్తున్నారు.  ఇప్పుడు ఏపీలో ఊరూ,వాడా సభలు పెడుతున్న షర్మిల.. ఎక్కడకు వెళ్లినా తన అన్న జగన్‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ పేరును పదే పదే ప్రస్తావిస్తుండటం గమనార్హం.
సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె కేంద్రంలోని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఓటు బ్యాంకే ఉన్నప్పటికీ.. భారతీయ జనతాపార్టీ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం చేయలేదు.  రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వం ఏ పార్టీ ఆధీనంలో ఉన్నప్పటికీ.. సఖ్యతను కొనసాగించాలనే విధానాన్నే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అమలు చేస్తోంది.
కాంగ్రెస్ చీఫ్‌‌గా కొత్తగా నియమితులైన  షర్మిల మాత్రం తన అన్న అప్రజాస్వామిక విధానాలను విమర్శిస్తున్న ముసుగులోనే.. భారతీయ జనతాపార్టీని ఆ రొంపిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ పవర్ గేమ్‌లో భారతీయ జనతాపార్టీని లాగటం ఏంటని..? ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ప్రత్యేకంగా కొన్ని వర్గాల ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేక భావాన్ని పెంచేలా జరుగుతున్న కుట్రలుగా వీటిని అభివర్ణిస్తున్నారు.