మాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు

మాల్దీవుల పార్లమెంట్‌లో ఆదివారం రభస దృశ్యాలు కానవచ్చాయి. పార్లమెంట్ సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధ్యక్షుడు మహమద్ ముయిజ్జు క్యాబినెట్ మంత్రులకు పార్లమెంటరీ ఆమోదముద్ర కోసం ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 

ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి), మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ (పిపిఎం) ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి) ఎంపిల మధ్య సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. 

ఆన్‌లైన్‌లో వైరల్ అయిన వీడియోల ప్రకారం, ఎంపిలు పరస్పరం తన్నుకోవడం, ముష్టిఘాతాలు ఇచ్చుకోవడంతో పార్లమెంట్‌లో గందరగోళం నెలకొన్నది.  స్థానిక ఆన్‌లైన్ నెట్‌వర్క్ అధధు పంచుకున్న వీడియోలో కూడా కొందరు సభ్యులు పోడియం మీద నుంచి పరస్పరం కిందకు లాక్కోవడం కనిపించింది.

పార్లమెంటేరియన్ల చాంబర్లలోకి ప్రవేశించకుండా ప్రతిపక్ష ఎంపిలను అధికార కూటమి అడ్డుకోవడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  మరోవైపు స్పీకర్‌ చాంబర్‌లోకి ప్రవేశించిన విపక్ష సభ్యులు అక్కడ హంగామా చేశారు. 

మాల్దీవుల పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్న ఎండిపి అధికార పార్టీ సభ్యులు నలుగురిని ముయిజ్జు మంత్రివర్గంలో చేరడాన్ని ఆమోదించబోమని స్పష్టం చేసింది.  వారి ఎన్నిక ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాన్ని కొనసాగించకుండా స్పీకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ)కు చెందిన సంకీర్ణ ప్రభుత్వం సభ్యులు విపక్ష సభ్యులపై భౌతిక దాడులకు దిగారు. నలుగురు సభ్యులకు ఆమోదాన్ని నిలిపివేయడం ప్రజలు సమకూర్చిన సేవలను అడ్డుకోవడమే అవుతుందని అంటూ పిఎన్‌సి, పిపిఎం ఒక ప్రకటన విడుదల చేశాయి. 

మంత్రులకు పునర్నియామకానికి హక్కు ఉంటుందని ముయిజ్జు ముఖ్య సలహాదారుడు, పిఎన్‌సి చైర్‌పర్సన్ అబ్దుల్ రహీమ్ అబ్దుల్లా సమర్థించారు. వారికి ఆమోదాన్ని నిలిపివేయడం ‘బాధ్యతారహిత’ చర్య అని ఆయన అన్నారని అధధు తెలియజేసింది.