చిక్కుల్లో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే.. కేంద్ర సంస్థల అప్రమత్తం

పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే, నోవా అగ్రి టెక్ లిమిటెడ్ చైర్మన్ ఏలూరి సాంబశివరావు చిక్కుల్లో పడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అవకతవలకు పాల్పడ్డారని, ఓటర్లకు డబ్బులు పంచినట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ మేరకు ఆధారాలను సంపాదించినట్లు తెలుస్తోంది. 

దీంతో ఈ అక్రమ కార్యకలాపాలపై బాపట్ల జిల్లా పోలీసులు ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబీ వర్గాలను అప్రమత్తం చేశాయి.  జనవరి 24న ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నోవా అగ్రి టెక్ ప్రాగంణంలో జనవరి 24న సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా ఓ డైరీ లభించింది. అందులో 2019 ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బుల్చిన వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.

డైరీలో తేదీలు, గ్రామాల పేర్లు, బూత్‌ల వారీగా ఎంతమంది ఓటర్లు ఉన్నారనే వివరాలతోపాటు బయటి నుంచి ఓటర్లను తీసుకురావడానికైన రవాణా ఛార్జీలు, ఇతర వివరాలను ఈ డైరీలో పేర్కొన్నారు. ఇదంతా అక్రమ సొమ్మని, 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ డబ్బును ఓటర్లకు పంచి లబ్ధి పొందారని భావిస్తున్నారు.

ఏలూరి సాంబశివరావు 2014తోపాటు 2019లోనూ పర్చూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో గొట్టిపాటి భరత్ కుమార్‌పై 10 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన ఆయన, 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై 1647 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. నోవా గ్రూప్‌లో దొరికిన డైరీలో దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం గ్రామాల్లో డబ్బు పంపిణీకి సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ అయిన మొదటి వారంలో 2.44 లక్షల టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం కోసం ఫామ్-7లను దరఖాస్తు చేశారని ఏలూరి సాంబశివరావు గతంలో ఆరోపించారు. అదే వారంలో కొత్త ఓటర్ల కోసం 1.20 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 15 లోపు ఓట్ల అవకతవకలు జరిగాయని, 20 నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఓట్లను తొలగించారని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.