అయోధ్య రామునికి ‘శ్రీ రామ్ రాగ్ సేవ’

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో ‘శ్రీరామ్ రాగ్ సేవ’ ఉత్సవంలో పాల్గొననున్న ప్రముఖ కళాకారుల్లో హేమమాలిని, అనూప్ జలోటా, మాలినీ అవస్థి, అనూరాధ పౌడ్వాల్, సోనాల్ మాన్‌సింగ్ కూడా ఉన్నారు. శ్రీరాముని అంకితమైన 45 రోజుల భక్తి సంగీత ఉత్సవం శుక్రవారం ప్రారంభం కాగా మార్చి 10న పరిసమాప్తం కానున్నది. 

‘శుక్రవారం నుంచి శ్రీ రామ్ జన్మభూమి ఆలయంలో శాస్త్రీయ సంగీత సంప్రదాయం ప్రకారం ‘రాగ్ సేవ’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శ్రీరాముని ముందు గల గుడి మండపంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాల నుంచి 100 మందికి పైగా ప్రముఖ కళాకారులు రానున్న 45 రోజుల పాటు శ్రీరాముని పాదాల ముంగిట తమ ‘రాగ్ సేవ’ అందించనున్నారు’ అని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర సభ్యుడు ఒకరు వెల్లడించారు.

ఆలయం గర్భగుడికి ముందు గుడి మండపం ఉన్నది. ‘ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం రూపకర్త, సమన్వయకర్త యతీంద్ర మిశ్రా. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ మద్దతు ఇస్తోంది’ అని ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. ‘రాగ్ సేవ శాస్త్రీయ సంప్రదాయం. ఈ పరంపరలో ముందుగా ఉత్తర ప్రదేశ్ నుంచి మాలినీ అవస్థి పాల్గొంటున్నారు. 

ఆమె ‘సోహర్’, ‘బధవ’, ‘మంగళ్ గాన్’ వంటివి ఆలాపించనున్నారు’ అని ఆ సభ్యుడు తెలిపారు. ‘రాగ్ సేవలో పాల్గొననున్న కళాకారులలో వైజయంతిమాల, సిక్కిల్ గురుచరణ్, పండిత్ సజన్ మిశ్రా, జస్బీర్ జస్సీ, అరుణా సాయిరామ్, స్వప్న సుండరి, రాహుల్ దేశ్‌పాండే, సురేష్ వాద్కర్, దర్శన ఝవేరి, ఉదయ్ భవాల్కర్; జయంత్ కుమరేశ్, పూర్ణా దాస్ బౌల్, రజనీ, గాయత్రి, దేవకీ పండిత్ కూడా ఉన్నారు.

45 రోజుల కార్యక్రమంలో బసంతి బిష్త్, ప్రేరణ శ్రీమాలి, సునంద శర్మ, మీటా పండిత్, పద్మా సుబ్రహ్మణ్యం కూడా గాన కచేరి చేయనున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంలో ప్రతిధ్వనించిన ‘మంగళ్ ధ్వని’కి యతీంద్ర మిశ్రా ఆధ్వర్యం వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏభై సాంప్రదాయక సంగీత పరికరాలను ఆ కార్యక్రమంలో ఉపయోగించారు. ‘మంగళ్ ధ్వని’కి ముందు సోనూ నిగమ్, అనూరాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్ శ్రీరాముని నుతిస్తూ పాటలు పాడారు.

దర్శనానికి రాష్ర్టాల వారీగా స్లాట్లు

అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా ఉన్నందున రాష్ట్రాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తున్నది. ఒక్కో రాష్ర్టానికి షెడ్యూల్‌ కేటాయించేలా, అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలకు ఆహ్వానాలు పంపేందుకు సిద్ధం అయ్యింది. ఆయా తేదీలు, సమయాల్లోనే ఆయా రాష్ట్రాల నుంచి భక్తులను దర్శనానికి పంపేలా ఏర్పాట్లు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. 
 
స్లాట్లు కేటాయిస్తే భక్తుల రద్దీని నియంత్రించేందుకు వీలు అవుతుందని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు, భక్తుల రద్దీ తగ్గాక ఎన్నారైలను ఒకేసారి రామయ్య దర్శనానికి ఆహ్వానించాలని ట్రస్ట్ భావిస్తున్నది.