దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు

దేశంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్ల సంఖ్య 96 కోట్లకు చేరిందన కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో మహిళా ఓటర్లు 47 కోట్ల మంది ఉన్నారని ఈసీ తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని పేర్కొంది. 
 
ఈ సంఖ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91 కోట్ల ఉండగా, ప్రస్తుతం దాని కంటే 5 కోట్ల అధికం కావడం విశేషం. అలాగే, అర్హులైన ఓటర్లలో 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వయసువారు ఉన్నట్టు తెలిపింది.  దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దాదాపు 1.5 కోట్ల మంది సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. 
 
గతేడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన ఓ లేఖ ప్రకారం దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 1957 నాటికి 19.37 కోట్లు ఉన్నారు. ఇక, 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరింది. తొలి సాధారణ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇది 67 శాతంగా ఉంది. మొత్తం ఓటర్లలో 18 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. 

కాగా, 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ‘మన ప్రజాస్వామ్యం విశాలత, వైవిధ్యం మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం అద్భుతమైన ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు ఈసీని అభినందించారు. ఈసీ ఇప్పటివరకు 17 పార్లమెంట్‌ ఎన్నికలు, 400కి పైగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిందని ఆమె  కొనియాడారు.

కాగా, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈసీ గురువారం ఓటర్ల అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ‘ఎన్నికల పండుగ.. దేశానికి గర్వకారణం’ అనే ట్యాగ్‌లైన్‌తో దీనిని చేపట్టింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజకీయ పార్టీలు విభజన కంటే ప్రేరణ కల్పించే చర్చల్లో పాల్గొనాలని కోరారు.

‘దేశంలోని అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు ఏర్పాట్లు చేయడం అంత సులభం కాదు. అన్ని రకాల సవాళ్లు ఉన్నప్పటికీ, ఎన్నికల కమిషన్ బృందం ఈ కష్టమైన పనిని నిర్వహిస్తుంది. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం’ అని రాష్ట్రపతి తెలిపారు. కాగా, మరో నెల రోజుల్లో ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడికానుంది.